నవతెలంగాణ తాండూరు: రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి ఏఎస్సై మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. వికారాబాద్ రైల్వే ఎస్హెచ్వో హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చించోలి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి (49) కలబురగి జిల్లా జేడీ హల్లి పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి విధులకు వెళ్లేందుకు తాండూరు రైల్వేస్టేషన్లో రాత్రి 11 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడ్డారు. రెండు కాళ్లు విరిగిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది శ్రీను, నదీమ్ ఆయన్ను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు కలబురగిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్హెచ్వో తెలిపారు.