Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్రీడలు కాకుండా..ఫామ్‌హౌస్‌ పోటీలకు వస్తారా?

క్రీడలు కాకుండా..ఫామ్‌హౌస్‌ పోటీలకు వస్తారా?

- Advertisement -

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

శాసనసభ సమావేశాల సమయంలో సభ్యుల ఆరోగ్యం కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా క్రీడల పట్ల యువతను మళ్లించడానికే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈ పోటీలను కేటీఆర్‌తోపాటు వారి పార్టీ బహిష్కరిస్తున్నదని, మరి ఫామ్‌హౌస్‌ పోటీలకు వస్తారా? క్లబ్‌హౌస్‌ పోటీలకు వస్తారా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఆలోచన తీరు వేరని, యువతను క్రీడల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. క్రీడల అంశాన్ని కూడా తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారన్నారు.

గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. హరీశ్‌రావు ఒక కంపెనీపై అక్కసుతో మాట్లాడుతున్నారన్నారు. వారు పదేండ్లలో దోచుకుని, దాచుకున్నది ప్రజలు గమనించారని, అందుకే ఫాంహౌస్‌కు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పద్దులతో మీ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని ఆరోపించారు. తమ బడ్జెట్‌ పద్దులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

బినామీల మైనింగ్‌ వ్యాపారంపై ఎంక్వైరీ..
రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై మాత్రమే కాదు, పదేండ్లలో జరిగిన మైనింగ్‌ మాఫియాపై ముఖ్యమంత్రి ఎంక్వయిరీ వేశారని ఎమ్మెల్యే విజయరామారావు తెలిపారు. వారి బినామీల పేర జరిగిన మైనింగ్‌ వ్యాపారంపై ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చుతామన్నారు. గతంలో మైనింగ్‌ మాఫియాను ప్రశ్నించిన వారిని జైళ్లలో వేసి వేధించారని, గోదావరి, మానేరులో ఇసుక మాఫియా రెచ్చిపోయిందని చెప్పారు. పదేండ్లు ఇష్టానుసారంగా వారి కుటుంబ సభ్యులను బినామీలుగా పెట్టుకొని దోచుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శంకరయ్య మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా చర్చించలేదన్నారు. ల్యాండ్‌, మైన్‌, డ్రగ్‌ మాఫియా చేపట్టి సత్యవంతులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు నష్టం జరగకుండా ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో జీర్ణించుకోలేక రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కేటీఆర్‌ నియోజకవర్గంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వారిని తొక్కించి చంపిన ఘటనలున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర సంపద దోచుకొని, వ్యక్తిగత ఆస్తులు పెంచుకొని ప్రజా సంపద దిగమింగారని అన్నారు. ముఖ్యమంత్రి సీఐడీ ఎంక్వైరీ వేయడాన్ని హర్షిస్తున్నామని తెలిపారు. మంచి అంశాలపై చర్చ జరుగుతున్న క్రమంలో పొంగులేటి శ్రీనివాస్‌పై నిందలు వేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. తనకు రాజకీయ మార్గదర్శకులు పొంగులేటీనేన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పినప్పటికీ అసెంబ్లీలో చిల్లరగా వ్యవహరించారన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్‌కు, పొంగులేటి కుటుంబానికి సంబంధం లేకున్నా నింద వేస్తున్నారని ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ అన్నారు. ప్రజల్లో వారిని అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -