మూడు పండుగ సెలవులు
సమావేశాల ప్రాధాన్యతను చెప్పిన డిప్యూటీ సీఎం
ఆదివారమూ జరపాలన్న హరీశ్రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 31 వరకు నిర్వహించాలని బీఆర్ఎస్ సభ్యులు కోరగా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. కాగా సోమవారం తొలిరోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. 17,18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, మండలిలో చర్చ చేపట్టనున్నారు. 19న ఉగాది పండుగ సందర్భంగా ఉభయసభలకు సెలవు ప్రకటించారు. 20న ప్రారంభమయ్యే సమావేశాల్లో అసెంబ్లీలో ఉపముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 21న రంజాన్, 22న ఆదివారం సందర్భంగా ఉభయసభలకు విరామం ఇవ్వనున్నారు. 23 నుంచి సమావేశాలు కొనసాగనున్నాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగే అవకాశముంది.
అయితే బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు సమావేశాల మధ్యలో వచ్చే 22వ తేదీ ఆదివారం కూడా సభలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు బీఏసీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. బీఏసీ సమావేశానికి ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి టి.హరీశ్రావు, కేపీ వివేకానంద, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం నుంచి అక్భరుద్ధీన్ ఓవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాల ప్రాధాన్యత, ప్రభుత్వ వ్యవహారాల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించగా, ఇతర సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలైనన్ని ఎక్కువ రోజులు సభ నిర్వహించాలని కోరారు.
30 వరకు అసెంబ్లీ, మండలి భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



