సీఐ హామీతో ఆందోళన విరమణ..
నవతెలంగాణ – దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన భారతపు ప్రభాకర్ అనే దివ్యాంగునిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని కోరుతూ కొండపూర్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన భారత సత్తవ్వ, కుమారస్వామి కుటుంబాలకు ఇంటి పక్కనే ఉన్న పెరడు విషయంలో గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కుమారస్వామితో పాటు లింగయ్య, అమృత, గంగ లక్ష్మిలు సత్తవ్వపై దాడికి పాల్పడ్డారు. దీంతో పక్కనే ఉన్న సత్తవ్వ మరిది అయిన ప్రభాకర్ గొడవ ఆపేందుకు వెళ్లగా అతనిపై కుమారస్వామి, లింగయ్య, అమృత, గంగలక్ష్మీలు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవడం లేదని, న్యాయం చేయాలంటూ ఆదివారం పోలీస్ స్టేషన్ సమీపంలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఐ తహసీనుద్దిన్ ఎంత చెప్పినా వినకపోవడంతో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి రంగ ప్రవేశం చేసి వారితో మాట్లాడారు. దాడి చేసిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ విషయమై సిఐ రమణమూర్తిని వివరణ కోరగా ఫిర్యాదు స్వీకరించామని, పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే మెడికల్ రిపోర్ట్ రాకుండా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, రిపోర్టు రాగానే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరు కూడా మధ్యవర్తులతో పోలీస్ స్టేషన్ కు రాకూడదని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి పోలీసులకు తెలిపాలన్నారు. మధ్యవర్తులు ఎవరైనా ఇటువంటి విషయాల్లో కలగజేసుకొని ఇరు వర్గాలను రెచ్చగొట్టినట్లయితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
