– తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్గుడల్లోని 137 ప్లాట్లు
– మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
– ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్గుడ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే చదరపు గజానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఈ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాట్లు చాలా అనుకూలంగా ఉంటాయని గౌతం సూచించారు. మంచి కనెక్టివిటీతో ఎటువంటి వివాదాలు లేని క్లియర్ టైటిల్, ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేవుట్లను అభివృద్ది చేయడం, కొనుగోలు చేసిన వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు వీలుగా ఉన్న ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు గతంలో పెద్ద ఎత్తున స్పందన రావడం తో మరోసారి ప్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తు న్నామని ఆయన తెలిపారు. వీటి కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు నిర్ణీత ధరావతును (ఈఎండీ) మీ-సేవా కేంద్రాల్లో ఆన్లైన్ /యుపీఐ ద్వారా చెల్లించవచ్చనీ, అలాగే డీజీ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.
ఓఆర్ఆర్ -ఆదిభట్ల, ఐటి కారిడార్కు సమీపంలోని తొర్రూర్ లే అవుట్లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 వ తేదీన, ఓఆర్ఆర్ సమీపంలోని బహదూర్ పల్లి, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ఉన్న కుర్మల్గుడ ప్రాంతాల్లోని ప్లాట్లకు ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహిస్తామని గౌతం తెలిపారు. ఇతర వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని వివరించారు. పోన్ నెంబర్లు 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్పల్లి),7993455802 (కుర్మల్గుడ)లలో సంప్రదించవచ్చు.
అందుబాటులోని ప్లాట్లు
తొర్రూర్ -105 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. చదరపు గజానికి కనీస ధర (అప్సెట్ ప్రైస్) రూ. 25 వేలు కాగా ఇవి 200-500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి.
బహదూర్ పల్లి -12 ప్లాట్లు ఉన్నాయి. 200-1000 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ లేవుట్ లోని కార్నర్ ప్లాట్కు చదరపు గజానికి కనీస ధర రూ.30 వేలుగాను, ఇతర ప్లాట్లకు రూ. 27 వేలుగాను నిర్ధారించారు.
కుర్మల్ గుడ -20 ప్లాట్లు 200-300 చ.గజాల విస్తీర్ణంలో ఉండగా చదరపు గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దారించి బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నారు.
దరఖాస్తుకు ఆఖరు తేదీలు
తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపే వారు రూ. 2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6 తేదీ లోగా, బహదూర్పల్లిలోని ప్లాట్లకు రూ.3 లక్షలు, కుర్మల్గుడలోని ప్లాట్లకు రూ.2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



