- Advertisement -
- – మంత్రి చెప్పిన స్పందించరా…
– మా చావులకు మీరు బాధ్యులవుతారా…?
– కలెక్టరేట్ లో కంటతడి పెట్టిన రైతు కుటుంబం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ - కాయ కష్టం చేసి కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా మా గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషులు అడ్డుకుంటూ మమ్మల్ని చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని రైతు కుటుంబం కంటతడి పెట్టుకున్న సంఘటన సూర్యాపేట కలెక్టరేట్ లో గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతు గడ్డం సత్యనారాయణరెడ్డి, భార్య సులోచన, కుమారుడు హరీష్ రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలంలోని కోటపహాడ్ గ్రామంలో 209, 210 సర్వే నెంబర్ లలో పదేళ్ళ క్రితం 8.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తలా మూడెకరాల చొప్పున పట్టా చేయించుకున్నారు.
- గత ఎనిమిదేళ్ళుగా కబ్జాలో ఉండి సాగు చేస్తున్నపటికి గత రెండు సంవత్సరాలుగా గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషులు ఎలాంటి ఆధారాలు లేకుండా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మా భూమిలో నుంచి 30గుంటల వరకు దున్నారని అడ్డు వెళ్ళిన తమపై దాడి చేయగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామన్నారు. ప్రస్తుతం మా భూమికి వెళ్ళేందుకు దారి లేదంటూ తమను భూమిపైకి వెళ్ళకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రె డ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినప్పటికి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రస్తుతం వారు మమ్మల్ని భూమిపైకి వెళ్ళనీయకుండా చంపుతామంటూ బెదిరిస్తున్నారన్నారు. గత రెండేళ్ళుగా మా పొలం మొత్తం భీడుగా మారిందని మా పరిస్థితి దయానీయంగా ఉందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మా భూమి మాకు అప్పగించి సదరు పెద్దలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -