– ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం
– గృహ నిర్మాణంపై సమగ్ర విధానం రూపకల్పన
– ఒఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో అఫర్డబుల్ హౌజింగ్
– రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వ్యూహాలు : హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్టుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణా రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం ‘అఫర్డ్ బుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ – తెలంగాణా మోడల్ 2047’ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన, పర్యావరణ అనుకూల సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించనున్న విధానాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్గా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా దాదాపు 42 లక్షల ఇండ్లను నిర్మించగా, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. అంతే కాకుండా మధ్య తరగతి కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా సుమారు ఒక లక్ష ఇండ్లు నిర్మించనున్నట్టు ఆయన వివరించారు. గ ృహాల డిమాండ్- సరఫరా మధ్య భారీ అంతరం పూడ్చడానికి, వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా ఆదాయంతో సంబంధం లేకుండా ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రకటించారు.
పట్టణ ప్రాంతాల అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన ”గృహ నిర్మాణ తెలంగాణ నమూనా 2047” వైపు చారిత్రక అడుగు వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఒఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ తరహాలో ఇండ్లను నిర్మించాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలుగా విభజించి కోర్ ఆర్బన్ ప్రాంతంలో మురికివాడల పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో అందుబాటులో అద్దె గృహ నిర్మాణం, రవాణా కారిడార్ల వెంబడి గృహాల ఏర్పాటు, పరి-అర్బన్ ప్రాంతం ప్లాన్డ్ టౌన్షిప్లు, భారత్ సిటీ వంటి గ్రీన్ఫీల్డ్ శాటిలైట్ టౌన్లు, పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికుల గృహ వసతి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చిన్న/మధ్య తరహా టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్లతో అనుసంధానించబడిన అద్దె/కార్మికుల గృహ నిర్మాణం ప్రధాన వ్యూహాలుగా తయారు చేసినట్టు మంత్రి పొంగులేటి వివరించారు.అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్రమైన అఫర్డ్బుల్ హౌజింగ్ పాలసీ ఆవశ్యకత చాలా ఉన్నదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగా రూపొందించనున్న అఫర్డబుల్ హౌజింగ్ పాలసీలో ఇటీవల ప్రకటంచిన క్యూర్, ప్యూర్, రేర్ జోన్లకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలను నిర్దేశించనున్నామని వెల్లడించారు. ఈ సెమినార్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అభిజిత్ శంకర్ రే, రాంకీ సీఎండీ నంద కిషోర్, హడ్కో ఎండీ వి.సురేష్ , క్రెడారు ప్రెసిడెంట్ జి. రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో గృహ నిర్మాణ విధానం-2047
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



