దేశంలోనే మొట్టమొదటిది
కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో జిఎంఆర్-మాన్సాస్ సంస్థల మధ్య ఒప్పందం
విశాఖపట్నం : దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీకి విశాఖలో మంగళవారం అంకురార్పణ జరిగింది. దీనిని భోగాపురం సమీపంలోని విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద 136 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. అందుకు సంబంధించిన ఒప్పందం జిఎంఆర్-మాన్సాస్ సంస్థల మధ్య జరిగింది. విశాఖలోని రాడిషన్ బ్లూ రిసార్టులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు సంస్థలు ఒప్పంద పత్రాలు మార్చుకు న్నాయి. ఈ సందర్భంగా గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన వ్యవస్థల రాకతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడుతున్నాయన్నారు.
అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి గ్రామం భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఉందని, అలాంటి మహనీయుని పేరు మీద విమానాశ్రయం రావడం ఎంతో హర్షణీయమని, ఇది భావితరాలకు గొప్ప సందేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశం యువ దేశమని, టీమ్ వర్క్ ద్వారా అనేక గొప్ప ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. జిఎంఆర్ సంస్థతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్లో షార్ (ఇస్రో కేంద్రం) ఉందని, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ ఏర్పాటు చేసి ఒక సమగ్ర ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు.



