Monday, June 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅవార్డులూ అవమానాలూ

అవార్డులూ అవమానాలూ

- Advertisement -

”విడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న జాలమా పేరు పురస్కారమా!” అంటూ వ్యంగ్య కవితోక్తిని విసిరాడు ఘకూర్‌ కవి. నిజంగానే అవార్డుల పేరుతో ఆ పేరును అవమానిస్తున్నారు కదా! అనే భావం కలుగుతున్నది. గాంధీ పేరును బ్రాందీ షాపునకు పెట్టుకున్నట్లుగా కనపడుతున్నది. ఒక వ్యక్తిని గౌరవించడమంటే అతని వ్యక్తిత్వాన్నీ, ఆలోచనను, ఆశయాన్నీ గౌరవించడమే, కానీ కేవలం పేరును కాదు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ పేరున సినిమాలకు, నటులకు, కళాకారులకు అవార్డులు ప్రకటించింది. దీనిపై అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సినిమా వాళ్లకు పురస్కారాలివ్వడానికి గద్దర్‌ పేరును వాడుకోవడమే కాంట్రాస్ట్‌గా ఉన్నది. ఇప్పుడు విమర్శలు రావడానికి అదేకారణం. ఎందుకంటే గద్దర్‌ అనగానే మనకు సినిమా గుర్తురాదు. సినిమా నటులూ గుర్తుకురారు. పంచెకట్టి, గొంగడి భుజానేసుకుని ప్రజల బాధలను, గాధలను గానం చేస్తున్న రూపం, చైతన్యాన్ని రేకెత్తిస్తున్న పాట గుర్తుకొస్తాయి. మరీ ముఖ్యంగా ఆధిపత్యాన్ని ధిక్కరించే గొంతుక ధ్వని వినిపిస్తుంది. గద్దర్‌ పేరు సమకూర్చుకున్న అర్థం అది. అంతేకాని ఆయనను ఇంకో రకంగా ఊహించలేము. గద్దరు సినిమాలో నటించాడు. అందులోనూ జనగానమే చేశాడు.
”బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవు కొడుకో, నైజాము సర్కరోడా’… అని మాభూమి సినిమాలో గద్దరు గొంతుక, నటన నాటి జమీందారుల, దేశముఖ్‌లపై పేలుతున్న గీతంలా కనపడతాడు. అట్లాంటి గద్దర్‌ పేరు మీద ఇచ్చే అవార్డు, నాటి సాయుధ తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించి, మత విద్వేషంతో జరిగిన పోరాటంగా చూపిన ‘రజాకార్‌’ చిత్రానికి చరిత్ర వారసత్వ అవార్డుగా ప్రకటించడం ప్రజా సాంస్కృతిక రంగంలో ఉన్న ప్రతివారికీ అనుచిత నిర్ణయమని ఆగ్రహం తెప్పిస్తున్నది. గద్దర్‌ బతికున్నపుడు రాహుల్‌ గాంధీని కలవడానికి కారణం, దేశంలో మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకు మరింత బలమైన ఉద్యమాలకు పూనుకోవాలన్న ఉద్దేశ్యమే అందులో ఉంది. కానీ ఈ సినిమా మత విద్వేషాన్ని పెంచేలా తీసారు. చరిత్రను వక్రీకరించిన సినిమాకు గద్దర్‌ పేరుతో అవార్డు ఇవ్వడం గద్దర్‌ ఆశయాలకే అవమానకరమని, ప్రభుత్వానికీ అప్రతిష్టకరమని ప్రజా సాంస్కృతిక కేంద్రం ప్రకటించింది. అసలు ఈ అవార్డులు, ముఖ్యంగా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఆయన పేరు మీద ఇవ్వటం సరి అయినదేనా? గతంలో గద్దర్‌ పాడిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ పాటకు, ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాటకూ నంది అవార్డులొస్తే, నా ఆదర్శాలకు ఈ అవార్డులు వ్యతిరేకమని తిరస్కరించి తీసుకోలేదు. ఇక గద్దర్‌ అవార్డులు పొందిన నటులు, దర్శకులు, నిర్మాతలు ఎవరైనా కానీ కలెక్షన్లు, ఆదాయాలు, లాభాలు తప్ప, గద్దర్‌ కళా దృష్టి ఈషన్మాత్రమూ లేనివాళ్లే. గద్దర్‌ పేర ఇస్తున్నపుడు కనీసంగా, కుటుంబ కథా చిత్రాలు, సామాజిక ప్రయోజనం కలిగిన చిత్రాలకు ఇస్తామన్న ఒక గిరిగీతన్నా ఉంటే బాగుండేది. ఏ మాత్రం సామాజిక ప్రయోజనం లేని కల్కి సినిమా, స్మగ్లర్‌ పుష్పరాజ్‌ నటనకు రావటం గద్దర్‌ అభిమానులకు సహించడం లేదు.
ప్రజా కవి గద్దర్‌ ఆలోచనలు, ఆయన ఆచరణకు నేటి సినిమాలు పూర్తి భిన్నమైనవి. వ్యతిరేకం కూడా. ఆయనపై అభిమానాన్ని చాటుకోవాలంటే ఆ పేరుతో ఒక జానపద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. లేదా ప్రజా కళలను, జయధీర్‌ గారు చేస్తున్న ఆద్య కళల అభివృద్ధికి ఒక సంస్థను ఏర్పాటు చేయవచ్చు. ప్రజా కళలను నిర్వహిస్తున్న వారికి గద్దర్‌ పేరున పురస్కారాలూ ఇవ్వవచ్చు. అంతేకాని ఆ పేరుకు వెనకున్న ఆలోచనను తిరస్కరించే మినహాయించే పని చేస్తే అవమానించినట్లే అవుతుంది కదా! అయితే జ్యూరీ ప్రకటించిన అన్ని సినిమాలూ, నటులూ అర్హమైనవి కావు అని అనటం లేదు. కొన్ని మంచివి కూడా ఉన్నాయి. కానీ చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నిజానికి తక్కువ బడ్జెట్‌లో తీసే చిత్రాలు, చిన్న సినిమాలే మంచి సినిమాలుగా ఉన్నాయి. అట్లాంటి వాటిని ప్రోత్సహించడం కూడా చేయాలి. ప్రజాకవి కాళోజీపై తీసిన చిత్రానికి థియేటర్లే దొరకలేదు. దానికి ఈ అవార్డులు వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రాలే కారణం. కాబట్టి చిన్న చిత్రాలకు థియేటర్లను ఇవ్వట పెద్ద ప్రోత్సాహకమే అవుతుంది.
అధికారమే పరమావధిగా పని చేస్తున్న రాజకీయాలకు, స్వార్థ రాజకీయ నాయకులకు ప్రజా కళాకారులను, కళలను, వారి అవసరార్థమై వాడుకోవడమే తప్ప, వారి ఆలోచనలను, ఆశయాలను గౌరవించదు అనే దానికి ఇదో ఉదాహరణ. ఉద్యమ కళాకారుల్ని సాంస్కృతిక సారథి పేర ఉద్యోగులుగా మార్చి తమ రాజకీయ ప్రచారానికి వాడుకున్నది. ప్రజా కళాకారులను ఆదుకోవాలి తప్ప అదుపులో ఉంచుకోవాలనుకోవటం తగదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం అవార్డుల జ్యూరీ కమిటీకి కొన్ని నియమాలతో మార్గనిర్ధేశనం చేయాలి. ప్రజా కళాకారుల గౌరవాన్ని ఇనుమడింపచేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -