Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక రుగ్మతలపై చైతన్యం

సామాజిక రుగ్మతలపై చైతన్యం

- Advertisement -

రచనలకు అద్భుత స్పందన
తదుపరి కార్యచరణపై మంత్రి జూపల్లి సమీక్ష
ఎంపిక ప్రక్రియ వేగవంతం
పారదర్శకంగా చేయాలని ఆదేశాలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సామాజిక రుగ్మతలను రూపుమాపి, ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రభాత భేరి’ పేరిట చేపట్టిన వినూత్న ప్రయత్నానికి అపూర్వ స్పందన లభించింది. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కవులు, రచయితలు, కళాకారుల నుంచి కోరిన కథలు, కవిత్వం, పాటలు, సృజనాత్మక రచనలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం పురోగతి, అందిన ఎంట్రీల స్థాయి, తదుపరి చర్యలపై పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం హైదరాబాద్‌ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, రచయితలు, కళాకారుల నుంచి వందల సంఖ్యలో రచనలు పంపినట్టు అధికారులు మంత్రికి వివరించారు.

కథలు, కవితలు, పాటలు, హరికథ, బుర్రకథలకు సంబంధించిన పలు రచనలు అందినట్టు చెప్పారు. ఈ సృజనాత్మక స్పందనపై మంత్రి జూపల్లి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొలిపే శక్తి కవులు, కళాకారుల్లో ఉంది. వచ్చిన రచనల్లో అత్యుత్తమమైన, ప్రభావవంతమైన, సందేశాత్మక రచనలను మూల్యాంకనం చేసే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. సంక్రాంతిలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపికైన రచనలతో ఒక ప్రత్యేక వివిధ కళా రూపాల్లో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి తదుపరి కార్యచరణను రూపొందించాలని సూచించారు. సమాజహితం కోసం సేవ చేస్తున్న ప్రతి రచయితను, కళాకారుడిని ప్రభుత్వం గౌరవించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -