నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శనివారం రోడ్లపై , క్యారేజ్ వేపై అనధికారంగా వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కమ్మర్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, లింబాద్రి మాట్లాడుతూ రోడ్లపై వాహనాలను అనధికారంగా నిలిపివేయడం చట్ట విరుద్ధమని, దీనివల్ల అంబులెన్స్, ఫైర్ వాహనాలు వంటి అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుందన్నారు.
ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాల ముప్పు ఎక్కువవుతుందన్నారు.ప్రజలు తమ వాహనాలను తప్పనిసరిగా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని సూచించారు. షాపుల ముందు, మూల మలుపుల వద్ద, బస్ స్టాప్ల వద్ద వాహనాలను పార్క్ చేయరాదని హెచ్చరించారు. అనధికార పార్కింగ్ చేసిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అనిల్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, సహకరించి ప్రమాదాలను నివారించాలని ప్రజలను కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.



