నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సఅష్టించిన దృశ్య కావ్యం ‘బాహుబలి’ మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది. సినిమా విడుదలై పదేళ్లు కావొస్తున్న సందర్భంగా … రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే చిత్రంగా ఈ నెల 31న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సరికొత్త ట్రైలర్ను విడుదల చేసింది. ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈసారి కేవలం పాత సినిమాను మళ్లీ ప్రదర్శించడమే కాకుండా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సాంకేతికంగా ఎన్నో మార్పులు చేశారు.
అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్లయిన ఐమాక్స్, 4డీఎక్స్, డాల్బీ సినిమాలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రీమాస్టర్ చేసిన పిక్చర్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో ‘బాహుబలి’ ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్పై ఆస్వాదించే అవకాశం కలగనుంది. రెండు భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వెర్షన్ నిడివి 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేశారు. ఇప్పటికే ఈ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఒక దశాబ్దం తర్వాత తమ అభిమాన సినిమాను ఐమాక్స్ వంటి ఆధునిక సాంకేతిక ఫార్మాట్లో చూసేందుకు సినీ ప్రియులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



