నవతెలంగాణ హైదరాబాద్: అన్ని ప్రభుత్వ విభాగాల్లో పెన్డ్రైవ్ వాడకాన్ని నిషేధిస్తూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారిక సమాచారం బట్వాడాకు వాట్సప్ మెసేజింగ్ సర్వీస్ను కూడా నిషేధించింది. సైబర్ చౌర్యం ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత సైబర్ దాడులు వెలుగుచూశాయి. దాంతో ప్రభుత్వ సమాచారం నేరగాళ్ల చేతిలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి చెందిన పలు అధికారిక వెబ్సైట్లు మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విభాగం సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. వాటిని పునరుద్ధరించడంలో ఇప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజాసేవలకు ఆటంకం ఏర్పడింది. ఆ సమయంలో పవర్ సెక్టార్పై రెండు లక్షల సైబర్ దాడులు జరిగాయని, అన్నింటిని అడ్డుకున్నామని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గతంలో వెల్లడించారు.