రాజకీయ అవకాశాలు:కల్వకుంట్ల కవిత హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాము స్థాపించబోయే కొత్త పార్టీలో బంజారా సమాజానికి సముచిత గౌరవం, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ తో పాటు పలువురు బంజారా ప్రముఖులతో నాయక్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో ఆమె చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడు మంత్రివర్గంలో బంజారాలకు ఎప్పుడూ ప్రాతినిథ్యం ఉందనీ, అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో బంజారాలకు స్థానం కల్పించలేదని మండిపడ్డారు. కొత్త పార్టీ విధివిధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు తమ అమూల్యమైన సలహాలు అందించాలని కోరారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించే బంజారా యువతకు, నాయకులకు తమ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందన్నారు. సమావేశంలో బంజారా ప్రముఖులు, ట్రైబల్ వెల్ఫేర్ మాజీ కమిషనర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ భీమ్లా నాయక్, బస్కీ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి హరి నాయక్, ఎలక్ట్రిసిటీ బోర్డు ట్రైబల్ వింగ్ అధ్యక్షులు నారాయణ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీడియా సెక్రెటరీ భీముడు నాయక్, ఎలక్ట్రిసిటీ డీఈఈ బాలాజీ నాయక్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్ నాయక్, జాగృతి నాయకులు మోహన్ నాయక్, కళ్యాణ్ నాయక్, సక్రు నాయక్, రవి రాథోడ్, శివ నాయక్, రాంజీ నాయక్, మహేందర్ నాయక్, మానుకోట కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


