Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంపూలతో ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ

పూలతో ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్‌ రెడ్డి
తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

యావత్‌ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్‌ రెడ్డి అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని పేర్కొన్నారు. అంతటి ముఖ్యమైన ఈ పండుగను.. ప్రజా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. సోమవారం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన అతిథులకు, తెలంగాణ భవన్‌ ఉద్యోగులు, సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఏ.పీ జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘బతుకమ్మ పండుగ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వానికి గొప్ప ఉదాహరణ. తెలంగాణ ప్రజల జీవితంలో, కల్చర్‌లో అంతర్భాగం. బతుకమ్మ అంటే ”తల్లి.. బ్రతికి రా!” అని అర్థం. యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు పూలతో శక్తి స్వరూపిణిని పూజించి.. గౌరీ దేవికి అంకితం చేస్తారు. ఈ పండుగ మహిళా శక్తిని, ఐక్యతను చాటి చెబుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ.. బతుకమ్మ పండుగ మన ప్రాంత ప్రజల ప్రత్యేక అస్తిత్వాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో కీలక పాత్ర పోషించింది’ అని ఆయన వివరించారు.

‘బతుకమ్మ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. వివిధ దేశాల్లో స్థిరపడిన మన తెలంగాణ బిడ్డలు.. అక్కడ కూడా బతుకమ్మ పండుగను జరుపుకోవడం ద్వారా దీని ప్రత్యేకత యావత్‌ ప్రపంచానికి తెలుస్తోంది. అలాగే మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు బతుకమ్మ ప్రత్యేకత తెలిసేలా.. సీఎం రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నాం. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఊపిరి పోసిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివద్ధికి బంగారు బాటలు వేస్తోంది’అని జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఈ వేడుకలకు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, తెలంగాణ భవన్‌ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -