90 శాతం ఉత్తీర్ణత
సంక్షేమ గురుకులాల్లో ప్రథమ స్థానం
సీనియర్ ఇంటర్ స్టేట్ టాప్ 10లో 159 మంది విద్యార్థులు
42 కాలేజీల్లో వందశాతం ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో విజయకేతనం ఎగురవేశారనీ, సంక్షేమ గురుకుల్లాలో ప్రథమ స్థానంలో బీసీ గురుకులాలు నిలిచాయని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బి.సైదులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ ఇంటర్లో పది లోపు ర్యాంకుల్లో ఎంపీసీలో (988/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 97 మంది, బైపీసీలో (985/1000) వచ్చిన వారు 62 మంది ఉన్నారు. జూనియర్ ఇంటర్లో 16 మందికి ఎంపీసీలో 468 మార్కులు, 11 మందికి బైపీసీలో 438 మార్కులు సాధించారు.
సీనియర్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించిన బైపీసీ విద్యార్థి శ్రియ (994), బి. హిమానీ (993), రాథోడ్ నందు(993), ఎంపీసీలో బి.మధు (994), శ్రీనిధి (994), సీఈసీలో శ్రీలత (981), ఎంఈసీలో జాహ్నవి (983), హెచ్ఈసీలో రాజేశ్వరి (980) ఉన్నారు. జూనియర్ ఇంటర్ లో ఎంపీసీలో పి.ప్రవల్లిక (468)తో పాటు 15మంది విద్యార్థులు, కే.వైష్ణవి(468), బైపీసీలో పి. రాఘవి(438), వి. హేమశ్రీ(438) ఉన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 33 కాలేజీలు,జూనియర్ ఇంటర్ లో 9 కాలేజీలు మొత్తం 42 కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గతేడాది కంటే సీనియర్ ఇంటర్ లో 7 శాతం, జూనియర్ ఇంటర్లో 8 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తర్ణీత (70.58 శాతం) కాగా బీసీ గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సాధించారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలోని 261 కాలేజీల నుంచి ఈ ఏడాది జనరల్ క్యాటగిరీలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు 12,035 మంది హాజరవ్వగా 10,856 (90 శాతం), జూనియర్ ఇంటర్లో 14,783 మందికి గాను 12,664 మంది (86 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్లో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 8,490 మంది, బి గ్రేడ్ 2,097 మంది ఉన్నారు. జూనియర్ ఇంటర్లో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 9,628, బి గ్రేడ్ 2,360 మంది ఉన్నారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం 191 కు 183 మంది (96 శాతం) ద్వితీయ సంవత్సరం 176కు 172 మంది (98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఫలితాలు సాధించిన బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహాత్మా జ్యోతి బా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బి. సైదులు అభినందించారు.



