లోతట్టు ప్రాంతాల ప్రజలను షెల్టర్హోంలకు తరలించండి
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండాలి
ట్రాఫిక్ ఇబ్బందులు నియంత్రించండి : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
కలెక్టర్లతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలపై సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనీ, అవరసమైతే వారిని షెల్టర్హోంలకు తరలించాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని విభాగాలను అప్రమత్తం చేయాలని సీఎస్కు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అలెర్ట్గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. విపత్తుల నిర్వహణా శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, రహదారులు, పోలీస్ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు.
క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిసు ్తన్నామనీ, ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్వేలుపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. .అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు, ముంపు ప్రాంతాల్లో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసర మైన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని గస్తీ కోసం నియమించాలని ఆదేశించారు.
ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు కలెక్టర్లతో పొంగులేటి టెలికాన్ఫరెన్స్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలపై శుక్రవారం హైదరాబాద్లోని బీఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో అతిపెద్ద పండుగైన దసరాకు హైదరాబాద్ నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారనీ, వారి రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమ త్తం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మీ ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించినట్టు వెల్లడించారు. మూసీ నదిలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల వరదను అంచనా వేసి అంతే పరిమాణంలో దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.