Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

మొంథా తుపాన్‌ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
క్ష్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండండి
ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మొంథా తుపాన్‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం సీఎం అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. వరి కోతల సమయం కావడం… పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉందనీ, హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం.. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొంథా తుపాన్‌ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయం చేసుకోవాలనీ, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సీఎం సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదమున్నందున లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లోలెవల్‌ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున నగర, పురపాలక, గ్రామ పరిపాలనా సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.

వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలనీ, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ, వైద్యారోగ్య, పోలీస్‌, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో సాగాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -