ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టండి
రెవిన్యూ, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి
విపత్తులో ప్రతి నిమిషమూ విలువైనదే..
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నాగార్జునసాగర్, జూరాల, కడెం సహా ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖాధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న 72 గంటలలో ప్రతినిమిషం ఎంతో విలువైనదనీ, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సంయుక్త కార్యదర్శి కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్, జూరాల, కడెంతో సహా ప్రధాన ప్రాజెక్టులపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల వద్ద 24 గంటలూ పహారా పెట్టాలన్నారు. కాల్వకట్టలు తెగిపోయే సూచనలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.అందుకు అవసరమైన నిధుల కొరకై జీ.ఓ నెంబర్ 45 ప్రకారం అత్యవసర నిధులను వినియోగించుకోవాలన్నారు. పాలనాపరమైన అనుమతుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అలాగే నీటిపారుదల శాఖాధికారులు అటు రెవిన్యూ ఇటు పోలీస్ అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి విపత్తులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విపత్తు సమయంలో ప్రతి నిమిషం విలువైనదనీ, ఇటువంటి సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్ఛరించారు.
అప్రమత్తంగా ఉండండి…అలసత్వం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES