Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీజనల్‌ వ్యాధుల పట్లఅప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్లఅప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగిరం చేయాలి : జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ
– ఫాగింగ్‌ యంత్రాలు లేవన్న కలెక్టర్లు
నవతెలంగాణ -మహబూబ్‌ నగర్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రణాళిక బద్ధంగా అమలు చేసి ఆశించిన ప్రగతి సాధించాలని, సీజనల్‌ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అభివృద్ధి, పథకాలపై శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం ప్రకారం పైలట్‌ మండలంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. వానాకాలం సీజన్‌కు పంటల సాగు ప్రణాళిక, విత్తనాలు, ఎరువుల లభ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకు న్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకుంటే యజమానిదే బాధ్యత అని స్పష్టంచేశారు. అయితే, జిల్లా ఎమ్మెల్యేలు కోరినట్టు గ్రామ సభల్లో ప్రకటించిన అర్హుల జాబితా ప్రకారం ఇండ్లు మంజూరు చేసే విషయమై సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. దేవాదాయ, వక్ఫ్‌, శిఖం, అసైన్డ్‌ భూములు ఎన్ని ఉన్నాయన్న వివరాలను కలెక్టర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నియంత్రణకు ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయాలని అన్నారు. గతేడాది మహబూబ్‌నగర్‌ జిల్లాలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయని, ఈ సారి అలా జరగకుండా ముందస్తుగానే వార్డుల వారీగా దోమల నివారణకు ఫాగింగ్‌ చేయిస్తామని కలెక్టర్‌ విజయేందిర బోయి మంత్రికి తెలిపారు. నారాయణపేట జిల్లాలోనూ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్‌ యంత్రాలు లేవని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను మహబూబ్‌నగర్‌ నుంచి అంబులెన్స్‌ డ్రైవర్లు హైదరాబాద్‌లోని వెల్‌నెస్‌ సెంటర్‌కు తీసుకువెళ్తున్నారని నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి అంబులెన్స్‌ డ్రైవర్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి : జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు
నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నారాయణపేట, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఎంత మంది రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఅర్‌ బకాయిలు ఉన్నారని జూపల్లి అధికారులను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో 2023-24కు సంబంధించి ఒక మిల్లర్‌ రూ.3.7 కోట్ల బకాయి ఉన్నారని, నారాయణపేటలో 10 రైస్‌ మిల్లర్ల నుంచి 2019-20 నుంచి ఇప్పటిదాకా రూ.53 కోట్ల బకాయి ఉన్నారని అధికారులు తెలపగా, వారి నుంచి కలెక్టర్లు రికవరీ చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ప్రభుత్వ భూములు, అన్యాక్రాంతం భూముల వివరాలు సమాచారం అందించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి టోల్‌ ఫ్రీ నంబర్‌, వాట్సాప్‌ నెంబర్‌ ప్రజలకు తెలపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, అనిరుధ్‌ రెడ్డి, జి మధుసూదన్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్‌ చిట్టెం పర్నికా రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ పైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఓబే దుల్లా కొత్వాల్‌, కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్లు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -