నవతెలంగాణ – హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనానికి పోలీసులు చలాన్(జరిమానా) విధిస్తున్నారు. అయితే వీటిని చెల్లించడంలో వాహన దారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకపై అలా చేసేందుకు వీలు ఉండదు. కేంద్ర రవాణాశాఖ రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం 45 రోజుల్లో చలాన్ చెల్లించకుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంకా పెండింగ్ పెడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.
చాలా మంది వాహనాలపై ఐదు నుంచి పది వరకు చలాన్లు పెండింగ్లో ఉంటున్నాయి. దొరికినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యం వహించడం వల్ల పెండింగ్ లిస్ట్ పెరుగుతూ పోతోంది. కానీ ఇక అది కుదరదు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్ను 45 రోజుల్లోపు చెల్లించాలి. 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉండి సదరు వాహనం పట్టుబడితే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయవచ్చు. ఇంకా ఆలస్యం చేస్తే రవాణాశాఖ ఆ వాహనంపై లావాదేవీలకు అనుమతించక పోయే అవకాశం ఉంది.