న్యూఇయర్ గ్రీటింగ్స్తో సైబర్ నేరగాళ్ల ఎర
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : టీజీసీఎస్బీ హెచ్చరిక
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నూతన సంవత్సర వేడుకల సమయంలో వాట్సాప్, ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో ‘ఆఫర్’ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ప్రజలను హెచ్చరించింది. ఈ విషయంలో అప్రమత్తత అవసరమని సూచించింది. ఈ మేరకు టీజీసీఎస్బీ డైరెక్టర్ శికా గోయల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. వాట్సాప్, ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో విస్తరిస్తున్న నకిలీ ‘హ్యాపీ న్యూ ఇయర్’ శుభాకాంక్షలు, బహుమతులు, ఆఫర్ లింక్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని టీజీసీఎస్బీ సూచించింది. సైబర్ నేరగాళ్లు పండుగ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని… ఎస్బీఐ క్రెడిట్కార్డు సంవత్సరాంత ఆఫర్లు, నూతన సంవత్సర బహుమతులు, ప్రయాణ రాయితీలు, ఈవెంట్ టికెట్లు వంటి పేర్లతో లింక్లను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించింది. ఈ తరహా లింక్లపై క్లిక్ చేయడం వల్ల బాధితుడి మొబైల్ ఫోన్లో తెలియకుండానే హానికరమైన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉందని టీజీసీఎస్బీ హెచ్చరించింది. వీటి ద్వారా సైబర్ నేరస్తులు నేరాలకు పాల్పడే అవకాశమున్నదని వివరించింది. అలాగే మెసేజింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా పంపబడే యాప్లు, అప్డేట్స్ను ఎప్పటికీ ఇన్స్టాల్ చేయవద్దని సూచించింది. ఓటీపీలు, పిన్, సీవీవీ నెంబర్లు, వెరిఫికేషన్ కోడ్లను ఎవరికీ తెలియజేయొద్దని పేర్కొన్నది. అధికారిక యాప్ స్టోర్ల ద్వారా మాత్రమే యాప్లను అప్డేట్ చేయాలని సూచించింది. సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే జాతీయ సైబర్ మోసాల హెల్ప్లైన్ 1930కి కాల్ చేయాలనీ, లేదంటే సంబంధిత వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని టీజీసీఎస్బీ ప్రజలను కోరింది.
వాట్సాప్ ‘ఆఫర్ లింక్’లతో జాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



