- Advertisement -
- – ఈ ఘటనలో మొత్తం 20 మంది కూలీలు గాయపడ్డారు
నవతెలంగాణ – కొనరావుపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 15 మంది పత్తి కూలీలపై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కనగర్తి- సుద్దాల గ్రామాల మధ్య జరిగింది. వివరాలు.. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ఉదయం పత్తి చేనులో పత్తి తీస్తున్న క్రమంలో సమీపంలోని తేనెపట్టు నుంచి ఒక్కసారిగా తేనెటీగల గుంపు లేచి వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.
దాడిలో పలువురు కూలీలు స్పృహ కోల్పోయారు. మరికొందరు తేనెటీగల కుట్టడంతో నొప్పితో రోదిస్తూ కనిపించారు. కూలీల ఆర్తనాదాలు విన్న స్థానికులు, చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సహాయంతో గాయపడిన కూలీలను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిలో లావణ్య, సుమలత, దేవేంద్ర, కర్ణ, మమత, లత, తేజ, శృతి, రజిత మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సివిల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



