నవతెలంగాణ – జుక్కల్
నియోజకవర్గంలో గల ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ హాస్టల్స్ వార్డెన్స్ తో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టల్స్ లో విద్యార్థుల యోగ క్షేమాలు, మౌలిక సదుపాయాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం మరియు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని చెప్పారు.
వసతి గృహాలు, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, దుస్తులు ఇవ్వడంతో పాటు మెరుగైన అధ్యయన వాతావరణం కల్పించాలి అని సూచించారు. విద్య ఒక్కటే పేదల బతుకులు మారుస్తుందని బలంగా నమ్ముతూన్నానని అన్నారు. ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని,విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తుగా పరిగణిస్తూ ప్రభుత్వ విద్యపై చేసే ఖర్చులో ఎటువంటి వెనకడుగు వేసేది లేదని తెలిపారు.