నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఆస్పత్రి లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. మంగళవారం అయన నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేశారు. మాత, శిశు సంరక్షణ కేంద్రంలో ఓపి, స్కానింగ్, వైద్యులు ,సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. వివిధ చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన రోగులతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారు. స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేసి రోజుకు ఎంత మందికి స్కానింగ్ చేస్తారని ? ఇన్ పేషెంట్లు? ఔట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పక్కనే ఉన్న దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ కేంద్రాన్ని, రోగుల సహాయకులు వేచి ఉండే గదిని తనిఖీ చేశారు. వెయిటింగ్ హాల్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, టాయిలెట్స్ ప్రతిరోజు శుభ్రపరచాలని, వెయిటింగ్ హాలు కు బోర్డు ఏర్పాటు చేయాలని శానిటేషన్ ఇంచార్జిని ఆదేశించారు. ధ్రువపత్రానికై యూ డి ఐ డి కేంద్రానికి వచ్చిన నార్కెట్ పల్లికి చెందిన సైదమ్మ ,తుమ్మడం గ్రామానికి చెందిన నాగరాజులతో ఆయన మాట్లాడి ఎప్పుడు వచ్చారని?ఏ రోజు స్లాట్ ఇచ్చారని? యు డి ఐ డి లో ధ్రువపత్రాల జారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. 823 మందికి స్కానింగ్ నిర్వహించినప్పటికీ, పరీక్షలు నిర్వహించడం, ధ్రువపత్రాలు జారీ చేయడం ఉందని యు డి ఐ డి ఇంచార్జి తెలుపగా, కేసులు పెండింగ్ లో లేకుండా చూడాలని, పని వేగవంతం చేయాలని, పెండెన్సీ తగ్గించాలని ఆదేశించారు.
దివ్యాంగుల ధ్రువపత్రాల జారిపై డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు. మరుగుదొడ్లను తనిఖీ చేసి ఎప్పుడు వాటిని పేషెంట్లకు అందుబాటులో ఉంచాలని,రోజు రెండుసార్లు టాయిలెట్లు శుభ్రం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం క్రిటికల్ కేర్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించి స్కిన్, ఓపి ,ఫిజియోథెరపీ విభాగాలను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ కోసమై వచ్చిన హుజూర్నగర్ సమీపంలోని కాల్వపల్లి కి చెందిన నాగయ్యతో మాట్లాడరు. బిపి ఎక్కువగా ఉందని, పక్షవాతం లక్షణాలు ఉన్నందువల్ల ఆసుపత్రికి వచ్చానని చెప్పగా ఎప్పటికప్పుడు బీపీ తెలుసుకోవాలని, పక్షవాతం వంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగుడు వంటివి మానేయాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి క్యాంటీన్ ను తనిఖీ చేసి అక్కడ ఉద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను, అవుట్సోర్సింగ్ సిబ్బంది హాజరు ను పరిశీలించారు. క్యాంటీన్ ద్వారా రోగులకు,డాక్టర్లకు అందిస్తున్న భోజనం పై వాకబు చేశారు .కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమయానికి రాకపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ డాక్టర్లు,సిబ్బంది అందరూ సమయం ప్రకారం విధులకు హాజరు కావాలని, ఆలస్యంగా వచ్చిన వారందరికీ మేమోలు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ నేత నరసింహారావును ఆదేశించారు. కాగా క్యాంటీన్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని సూపరింటీండెంట్ జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. జిల్లా కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటీండెంట్ నేత నరసింహారావు డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, డాక్టర్ స్వరూప, డాక్టర్ వందన తదితరులు ఉన్నారు.



