అధిష్టానం కబురు… హుటాహుటిన పయనం
మంత్రిత్వ శాఖల కేటాయింపు, మార్పులపై చర్చ
అసంతృప్తుల బుజ్జగింపులు.. ధిక్కరణపైనా ఆరా!
ఎస్సీ, బీసీ వర్గీకరణలపై త్వరలో సభలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీకి వెంటనే రావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏఐసీసీ కబురు పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వారు హుటాహుటిన హస్తినకు బయలుదేరారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై చర్చించేందుకు అధిష్టానం వారిని పిలిచినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి అధిష్టానంతో భేటీ అయిన విషయం విధితమే. ఆయన రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. తాజాగా ముగ్గురికి మంత్రి పదవులు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, మంత్రి పదవులు దక్కని ఆశావాహులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు స్వయంగా రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. బుజ్జగింపుల పర్వం, ఒకరిద్దరు ఎమ్మెల్యేల ధిక్కరణపైనా అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ఇప్పటికే ఉన్న మంత్రుల వద్ద ఉన్న శాఖల మార్పునకు సంబంధించి రాష్ట్ర నేతలతో హైకమాండ్ సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన తన సతీమణి ఉత్తమ్ పద్మావతితో కలిసి హస్తినకు వెళ్లారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో ఉండగానే భట్టికి ఫోన్ రాగా ఆయన కూడా ఢిల్లీకి వెళ్లారు. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.. మంత్రులకు శాఖల కేటాయింపు ఎలా జరగనుంది? బుజ్జగింపుల పర్వంలోనూ వినని నేతలకు ఎలా సర్దిచెప్పాలి? మిగతా మూడు బెర్తులనూ భర్తీ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ నుంచి ఆరా తీయనున్నట్టు తెలిసింది. నేతలంతా వరుసబెట్టి హస్తినకు పయనం అవుతుండటంతో అసలు అక్కడేం జరుగుతున్నదనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. భట్టి, సీతక్కల్లో ఒకరికి హోం, వాకిటి శ్రీహరికి పశుసంవర్థన, మత్స్యశాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వివేక్కు కార్మిక, మైనింగ్ శాఖలు ఇవ్వడంతో పాటు పలువురు మంత్రుల శాఖలను కూడా మార్చబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో స్థానిక సంస్థలకు వెళ్లే ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన తామే చేశామనే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో రెండు, మూడు బహిరంగ సభలు పెట్టే అంశంపైనా అధిష్టానం ఫోకస్ పెట్టి రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నట్టు వినికిడి.
ఢిల్లీకి భట్టి, ఉత్తమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES