నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా త్వరగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రోజు మోత్కూర్, అడ్డగూడూరు మండలాల తహసిల్దార్ కార్యాలయాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించుటకు తగు సూచనలు సలహాలు తెలియజేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును భూభారతిలో తప్పక నమోదు చేయాలన్నారు.
దరఖాస్తుదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. భూభారతి , రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను సాధ్యమనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా డిస్పోజ్ చేయాలన్నారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చూడాలన్నారు. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను మండల తహసీల్దార్ లాగిన్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పాత రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవిన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దారులు ఉన్నారు.