– ఇంట్రాడేలో సెన్సెక్స్ 450 పాయింట్ల పతనం
– తుదకు స్వల్ప లాభాలు..
ముంబయి : బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం కనబడినప్పటికీ స్టాక్ మార్కెట్లలో ఎలాంటి ఉత్సాహం కానరాలేదు. శుక్రవారం ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. ఎన్డీఏ అభ్యర్థులు మెజారిటీ వైపు సాగుతున్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. లోహ, ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 450 పాయింట్ల మేర పతనమై 84,029 కనిష్టానికి పడిపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో కేవలం 84 పాయింట్లు పెరిగి తుదకు 84,562 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 25,910 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్లో వాల్స్ట్రీట్లో ఏఐ సంబంధిత కంపెనీల స్టాక్స్లో అమ్మకాలు, డిసెంబర్లో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చన్న ఫెడ్ అధికారుల సంకేతాలు మార్కెట్ను మరింత ఒత్తిడికి గురి చేశాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎటెర్నల్, బీఈఎల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 0.08 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.38 శాతం చొప్పున పెరిగాయి. పీఎస్యూ బ్యాంకింగ్ అధికంగా 1.17 శాతం లాభపడ్డాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు వరుసగా 0.59 శాతం, 0.57 శాతం చొప్పున రాణించగా.. ఐటీ అత్యధికంగా 1.03 శాతం నష్టపోయింది.
మార్కెట్లలో కానరాని బీహార్ జోష్
- Advertisement -
- Advertisement -



