నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్లను విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.రాజస్థాన్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి, జమ్మూకశ్మీర్లో రెండు స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
రాజస్థాన్లోని అంటా (193) నియోజకవర్గం, ఒడిశాలోని నువాపడ (71), పంజాబ్లోని తర్న్ తారన్ (21) , జమ్మూకశ్మీర్లోని నాగ్రోటా (77), బుద్గాం (27) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈసీఐ ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను అక్టోబర్ చివరి వారం నాటికి పూర్తి చేసి, నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసీఐ ప్రకటనతో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.