రైతు పండించిన పంటకు ఎంఎస్పీ ప్రకటించాలి
నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-కొత్తగూడెం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం సమర్థవంతమైనటువంటి సమాచారం తీసుకున్న తర్వాత పార్లమెంట్ చట్టం చేయొచ్చనే సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఒకపక్క రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడుతూనే మరో పక్క రిజర్వేషన్లను అడ్డుకుంటూ విద్వేషాలని రెచ్చగొడుతుందన్నారు.
దేశ ప్రజల పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కుగా ఉన్న విద్యుత్ను అదానీ, అంబానీలకి అప్పజెప్పడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో గత యూపీఏ ప్రభుత్వం 4 శాతం కేటాయిస్తే నేడు బీజేపీ ప్రభుత్వం దాన్ని కుదించి 1.3 శాతానికి తీసుకొచ్చారని అన్నారు. వ్యవసాయం లాభసాటి కాదని రైతులను భూమి నుంచి దూరం చేసి, ఆయా భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. రైతు పండించిన పంటలకు ఎంఎస్పీ ప్రకటించాలని, ఉపాధి హామీకి నిధులు పెంచాలని, తదితర సమస్యలపై నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరుప తలపెట్టిన నిరసనను జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్, మండల కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి, వలమల్ల చందర్రావు, బోడ అభిమిత్ర, పార్టీ శాఖ కార్యదర్శి బొల్లి లక్ష్మయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాల్యమిత్రుడు విష్ణుమూర్తికి నివాళి..
జూలూరుపాడులో ఇటీవల మృతి చెందిన ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి చిత్ర పటానికి వెంకట్ పూల మాలవేసి నివాళులర్పించారు. విష్ణుమూర్తి మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.