స్టేట్ వర్క్షాపునకు డుమ్మా
బీజేపీ నేతలపై కవిత వ్యాఖ్యలకు సమర్థన
మీ బండారం బయటపెడతానంటున్న ఎమ్మెల్యే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరవమంటే కప్పకు కోపం…విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా బీజేపీ తెలంగాణ నేతల పంచాయితీ జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కిషన్రెడ్డి, రాజాసింగ్ మధ్య జరుగుతున్న అంతర్గతపోరు తారాస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యే, అసంతృప్త నేత రాజాసింగ్ కొరకరాని కొయ్యగా మారినట్టు బీజేపీ శ్రేణుల్లో చర్చ నడుస్తున్నది. కవిత కామెంట్లు…రాజాసింగ్ సమర్థన వ్యాఖ్యలు…ఇప్పుడు బీజేపీలోని లుకలుకలను మరోమారు బహిర్గతం చేశాయి. ఇదిలా ఉండగానే రాష్ట్రంలో రానున్న కాలానికి సంబంధించి కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడంపై జరిగిన కీలకమైన వర్క్షాపునకు రాజాసింగ్ ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
వర్క్షాపు సందర్భంగానూ ఇదే అంశంపై మీడియా ఫోకస్ పెట్టగా స్పందించేందుకు బీజేపీ సీనియర్ నేతలు నిరాకరించారు. అయితే, ఇటీవల ‘కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్లు కూడా బీఆర్ఎస్లో కలిసిపోతారు. తమ పార్టీ నుంచి నేతలు ఎక్కడ నుంచి నిలబడతారో కూడా వాళ్లే నిర్ధారిస్తారు. అధికారంలోకి వస్తారు అనే చర్చ నడుస్తున్న క్రమంలో అధ్యక్ష మార్పు అందులో భాగమే. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కు అయ్యారు. ప్రతి కార్యకర్తలోనూ ఇదే అభిప్రాయం ఉంది. ఎవరైనా మాట్లాడితే తొక్కిపడేస్తారు.. సస్పెండ్ చేస్తారు..అనే భయంతో గమ్ముగా ఉంటున్నారు’ అంటూ బహిరంగంగానే రాజాసింగ్ ప్రకటన విడుదల చేసిన విషయం విదితమే. కవిత కామెంట్లపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి ‘నోరు జారొద్దు’ అంటూ హెచ్చరికలు జారీ చేసినా రాజాసింగ్ ధిక్కరించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. ఇటీవల దీనిపై జాతీయ నాయకత్వం సూచనలతో ఎమ్మెల్యేలు, ఎంపీలతో కిషన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులోనూ రాజాసింగ్ పాల్గొనలేదని విశ్వసనీయ సమాచారం.
ఆ కాన్ఫరెన్స్లో కిషన్రెడ్డి..పేర్లు ప్రస్తావించకుండా పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీలో జరుగుతున్న వరుస ఘటనలు పార్టీ ముఖ్య నేతల మధ్య ఉన్న గొడవలను ఎత్తిచూపుతున్నాయి. మరోవైపు వరుసగా బీజేపీ కీలక సమావేశాలకు డుమ్మాలు కొట్టడం, ఎల్పీ సమావేశానికి హాజరుకాకపోవడం, పదేపదే ప్రకటనల ద్వారా పార్టీని ఇరుకునబెట్టడం వంటి చర్యలతో రాజాసింగ్పై కిషన్రెడ్డి గుర్రుగా ఉన్నట్టు ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధిష్టానం రాజాసింగ్కు నోటీసులు ఇవ్వబోతున్నదనే ప్రచారం సైతం జరుగుతున్నది. దీనిపై తన సన్నిహితులు, కొందరు మీడియా ప్రతినిధుల వద్ద రాజాసింగ్ స్పందిస్తూ… ‘నోటీసు కాదు సస్పెండ్ చేయండి…… తో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేము. ధర్మ కార్యక్రమాలు చేయలేము. గవర్నమెంట్ను తీసుకురాలేము. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నదనే విషయంపై నిజం చెప్పి, నేతల జాతకం ప్రజలందరి ముందు పెట్టి వెళ్తాను’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. జాతీయ స్థాయి నేతల ఆశీస్సులు పుష్కలంగా ఉండటం వల్లనే రాజాసింగ్ రాష్ట్ర నేతలెవ్వరినీ లెక్కచేయకుండా కొరకరాని కొయ్యగా మారారనే చర్చ నడుస్తున్నది.