సుప్రీం తీర్పుపై 23న క్యాబినెట్లో నిర్ణయం
బీజేపీ నేతలు మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలి
సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం
నేటి బీసీ బంద్కు మద్దతు
సింగరేణి కార్మికులకు రూ.400 కోట్ల దీపావళి బోనస్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఖమ్మం
బీసీ రిజర్వేష్లను బీజేపీ అడ్డుకుంటోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటే.. సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు పయనిస్తూ చెడుపై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్లు బోనస్ ప్రకటిస్తున్నామని, దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ సర్వే నిర్వహించామన్నారు. సర్వే వివరాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్కు పంపామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో స్థానిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా సీలింగ్ విధిస్తూ చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు. ఆ చట్టాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చామని, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్కు పంపామన్నారు. ఇలా అన్ని దశల్లో అవసరమైన చర్యలు చేపడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీ చట్టం అమల్లోకి రాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు.
బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికి తెలిసిందని భట్టి అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన హామీని తూచా తప్పక పాటించేందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి అన్ని పార్టీలను ఆహ్వానించగా దేశంలోని ఇతర పార్టీలన్నీ మద్దతు తెలియజేయగా కేవలం బీజేపీ ఎందుకు అడ్డుపడుతుందని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసును గెలిచేందుకు దేశంలో అనుభవిజ్ఞులైన అభిషేక్ మను సింగ్వి, రవి వర్మ వంటి న్యాయ కోవిదులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి కొట్లాడిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసని అన్నారు.
శనివారం రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు, రాష్ట్ర బీజేపీ విభాగం అధ్యక్షులు రామచంద్రరావు.. ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం సమయం తీసుకొని, రాష్ట్ర అఖిలపక్షానికి నాయకత్వం వహించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే బీసీల రిజర్వేషన్ల అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరావు, జావీద్, కొత్త సీతారాములు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.