– ప్రకటనలు, ప్రచారం కోసం భారీగా ఖర్చు
– పీఆర్, కమ్యూనికేషన్ సంస్థలకు పెద్ద మొత్తంలో చెల్లింపులు
– ఫేస్బుక్, గూగుల్ ఇండియాకు కూడా…
– కమలానికి అందనంత దూరంలో ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : ఎన్నికలు వచ్చాయంటే ప్రతి పార్టీ అంతో ఇంతో ఖర్చు చేయాల్సిందే. అయితే ఈ విషయంలో మిగిలిన పక్షాలతో పోలిస్తే బీజేపీ అందనంత ఎత్తులో ఉంది. ఎన్నికలలో ఆ పార్టీ చేస్తున్న ఖర్చు కొండలా పెరిగిపోతూనే ఉంది. 2018లో కేంద్ర ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని పరిమితం చేయాలనే ప్రతిపాదన ఆ సమావేశంలో చర్చకు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల వ్యయాన్ని నియంత్రించాలని, దానిపై పరిమితి విధించాలని పట్టు పట్టాయి.
వ్యయాల మధ్య పెరిగిన అంతరం
అఖిలపక్ష సమావేశం జరిగిన తొమ్మిది నెలల తర్వాత 2019లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో బీజేపీ ఏకంగా రూ.1,264 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ చేసిన వ్యయం రూ.820 కోట్లతో పోలిస్తే ఇది రూ.444 కోట్లు ఎక్కువ. ఇక 2024 లోక్సభ ఎన్నికలు దేశంలో ఇప్పటి వరకూ జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలలో ఒకటిగా నిలిచాయి. బీజేపీ ఖర్చు అమాంతం రూ.1,737.68 కోట్లకు పెరిగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పెట్టిన ఖర్చు రూ.686.19 కోట్లకు తగ్గిపోయింది. ఈ రెండు పార్టీల వ్యయాల మధ్య అంతరం అక్షరాలా రూ.1,048.49 కోట్లు. అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల వ్యయాల మధ్య తేడా రూ.604 కోట్ల మేర పెరిగిందన్న మాట. మరో మాటలో చెప్పాలంటే అది 136.04 శాతం పెరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఈ గణాంకాలన్నీ ఆయా పార్టీలు ఎన్నికల కమిషన్కు అందించిన నివేదికే. వాస్తవ ఖర్చు దాని కంటే అనేక రెట్లు అధికంగా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు.
హైటెక్ ప్రచారంపైనే దృష్టి
ఎన్నికల కమిషన్కు బీజేపీ, కాంగ్రెస్ సమర్పించిన వ్యయ నివేదికలను ‘ది క్వింట్’ పోర్టల్ విశ్లేషించింది. ప్రధాన పార్టీలు చేసిన వ్యయంలో భారీ వ్యత్యాసం కన్పించింది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల వ్యయం ఆకాశమంత ఎత్తుకు చేరింది. కొన్ని సందర్భాలలో ఇతర పార్టీల కంటే బీజేపీ ఎన్నికల వ్యయం యాభై శాతం ఎక్కువగా ఉంది. ప్రచారం, మీడియాపై రెండు పార్టీలు పెట్టిన ఖర్చును పరిశీలించగా…ఎన్నికల ప్రకటనల కోసం కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన స్రవంతి మీడియాపైనే ఆధారపడుతోందని తేలింది. మరోవైపు బీజేపీ పీఆర్, కమ్యూనికేషన్ సంస్థలపై ఎక్కువగా ఖర్చు చేసింది. అంతేకాక పార్టీ ప్రచార సాధనాలతో పాటు ఫేస్బుక్, గూగుల్ వంటి సాంకేతిక దిగ్గజ సంస్థలపై భారీగా ఖర్చు చేసింది. అయితే ఈ వ్యయ నివేదికలు పూర్తి చిత్రాన్ని మన ముందు ఉంచుతాయా?
అరకొర సమాచారమే
చట్ట ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్ణీత కాలపరిమితి లోగా వ్యయ నివేదికను ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ప్రకటించిన 90 రోజులలో, శాసనసభ ఎన్నికలు అయితే ఫలితాలు ప్రకటించిన 75 రోజులలో నివేదికలు అందజేయాలి. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఏడు నెలల తర్వాత బీజేపీ తన వ్యయ నివేదికను ఈసీకి అందించింది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా వాటిలో కేవలం 22కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందులో పొందుపరచింది. ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వివరాలు అందులో లేవు. అదీకాక అనేక రాష్ట్రాలలో ఖర్చులకు సంబంధించిన పలు కాలమ్స్ను ఖాళీగానే వదిలేశారు. ఉదాహరణకు ఢిల్లీలో ప్రచార నిమిత్తం స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చులను అందించలేదు. ఈ నేపథ్యంలో ఖర్చులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడం సాధ్యపడలేదు.
పారదర్శకత ఏది?
ఇక కాంగ్రెస్ పార్టీ 65 పేజీల నివేదికను సమర్పించింది. బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పార్టీ ఖాతాలో ప్రారంభ నిల్వలు వరుసగా రూ.25,713, రూ.10,500 మేర ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. ఈ మొత్తాలు చాలా తక్కువగా ఉండడంతో భవిష్యత్ ఖర్చులపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయ నివేదికల నిండా అవకతవకలేనని, ఇక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఎక్కడ ఉంటుందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వ్యవస్థాపక సభ్యుడు జగదీప్ చోకర్ ప్రశ్నించారు. ‘ఈ షాడో నివేదికలు ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి ఎంతమాత్రం దోహదపడవు. రాజకీయ పార్టీలు వ్యయ నివేదికలను సమర్పించడంలో జాప్యం చేస్తున్నాయి. కాబట్టి బహిర్గతమయ్యే సమయానికి వాటికి పెద్దగా విలువ ఉండదు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నమూనాలో వివరాలు సమర్పించినప్పుడే మెరుగుదల కన్పిస్తుంది. స్వతంత్ర ఆడిట్కు అవకాశం లేదు కాబట్టి అనేక సమస్యలు ఉంటాయి’ అని ఆయన తెలిపారు.
బీజేపీ చెల్లింపులు వీరికే
పీఆర్ సంస్థలు, పార్టీకి బాకా ఊదే సంస్థలకు బీజేపీ జరిపిన చెల్లింపుల విషయాన్ని పరిశీలిద్దాం. బీజేపీ ప్రకటించిన మొత్తం ఖర్చు రూ.1,737.68 కోట్లలో పార్టీ ప్రకటనలు, ఎన్నికల ప్రచారానికి రూ.684.57 కోట్లు వెచ్చించింది. ఇది కాంగ్రెస్ చేసిన మొత్తం ఎన్నికల వ్యయం రూ.686.19 కోట్ల కంటే సుమారు రెండు కోట్ల రూపాయలు మాత్రమే తక్కువ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాని మొత్తం ఖర్చు రూ.584.65 కోట్లలో ప్రకటనల కోసం చేసిన వ్యయం రూ.410 కోట్లు. అంటే మొత్తం వ్యయంలో 70 శాతం అన్న మాట. బీజేపీ అత్యధిక చెల్లింపులు జరిపిన సంస్థలలో మాడిసన్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పబ్లిసిటీ సంస్థలు ఉన్నాయి. పార్టీ పెట్టిన మొత్తం ప్రకటన ఖర్చులో సుమారు సగం…అంటే రూ.315 కోట్లు ఆ సంస్థలకే ముట్టాయి. ప్రకటనల దిగ్గజ సంస్థ శామ్ బల్సారా యాజమాన్యంలోని మాడిసన్ 2014, 2019 ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రింట్, టీవీ, రేడియో ప్రచారాలు నిర్వహించింది. బీజేపీ తన ఎన్నికల ప్రచారం కోసం గూగుల్ ఇండియాకు అదనంగా రూ.156.95 కోట్లు చెల్లించింది. మాడిసన్, పార్టీ పత్రిక జన్మభూమి, భారత్ ప్రకాశన్ వంటి కమ్యూనికేషన్ ఏజెన్సీల ద్వారా ప్రధాన స్రవంతి మీడియాకు చెల్లింపులు జరిగాయి. ఆర్ఎస్ఎస్ పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్లకు కూడా భారీగానే సొమ్ము ముట్టజెప్పారు.
ప్రచార వ్యయంలో 45 శాతం బీజేపీదే
ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ అయిన వివిధ పార్టీల వ్యయ నివేదికల విశ్లేషణల ప్రకారం…2024 లోక్సభ ఎన్నికలు, వాటితో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో 22 రాజకీయ పార్టీలు చేసిన ప్రచార వ్యయంలో 45 శాతం ఒక్క బీజేపీయే ఖర్చు చేసింది. ఆమ్ఆద్మీ, అసోం గణపరిషత్, అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, బీజేడీ, బీజేపీ, సీపీఐ(ఎం), డీఎంకే, కాంగ్రెస్, జేడీఎస్, జేడీయూ, ఎల్జేపీ (రాం విలాస్), ఆర్జేడీ, ఎస్డీఎఫ్, సిక్కిం క్రాంతికారి మోర్చ, టీడీపీ, వైసీపీ, మజ్లిస్ పార్టీలు ఈసీకి వ్యయ నివేదికలు సమర్పించాయి. బీజేపీ చేసిన ఖర్చుతో పోలిస్తే కాంగ్రెస్ వ్యయం సుమారు 40 శాతం తక్కువగా ఉంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు లభించేలా పార్టీల ఖర్చుపై పరిమితి విధించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిందని మాజీ సీఈసీ ఓపీ రావత్ చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితి ఉందే తప్ప పార్టీల వ్యయంపై లేదు. రాజకీయ పార్టీలకు ఉన్న ఈ మినహాయింపు కారణంగా అభ్యర్థులు తమపై విధించిన వ్యయ పరిమితి నిబంధనను తేలికగా ఉల్లంఘించ వచ్చునని, అంతకంటే ఎక్కువగా పెట్టిన ఖర్చును పార్టీ ఖాతాలో వేస్తారని రావత్ తెలిపారు.
లా కమిషన్ నివేదికను 2018లో జరిగిన అఖిలపక్ష సమావేశం ముందు ఉంచారు. లాబీయింగ్, ఖర్చును తక్కువగా చూపడం, వ్యయ పరిమితి విధిస్తే నల్లధనం చెలామణిలోకి వచ్చే అవకాశం వంటి అంశాలపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలంటే వ్యయ పరిమితిని విధించడమే తొలి అడుగు అని రావత్ అన్నారు. రాజకీయ పార్టీలు ఈ పరిమితికి లోబడే ఖర్చు చేశాయని నిర్ధారించుకోవడానికి అవసరమైన నిఘా వ్యవస్థ ఈసీ వద్ద ఉన్నదని ఆయన తెలిపారు.
ఎన్నికల వ్యయంలో బీజేపీ టాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES