Saturday, June 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడు రెట్లు పెరిగిన నల్లధనం

మూడు రెట్లు పెరిగిన నల్లధనం

- Advertisement -

స్విస్‌ బ్యాంక్‌ల్లో దాచిన పెద్దలు
ఏడాదిలోనే భారీగా తరలింపు
48వ స్థానంలోకి ఎగబాకిన భారత్‌

”భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం పెద్ద ముప్పుగా మారింది. ఇది పన్ను ఎగవేత, అవినీతి, ఆర్థిక అసమానతలకు కారణం. గత ప్రభుత్వాల్లో దోచిన డబ్బును దేశ సంపదను విదేశాలకు తరలించడం ద్వారా సామాన్య ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు అందకుండా చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్విస్‌ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతి భారతీయుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు వేస్తాము.” అని 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ పదే పదే ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా.. ఇది జుమ్లాగానే మిగిలిపోయిందని మరోమారు నిరూపణ అయ్యింది. స్విస్‌ బ్యాంక్‌ల్లో ఉన్న నల్లధనాన్ని తేకపోగా.. అది మరింత పెరుగుతోంటే మోడీ సర్కార్‌ కండ్లప్పగించి చూస్తోంది.
నవ తెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
రాజకీయ పెద్దలు, కార్పొరేట్లు అక్కడ రికార్డు స్థాయిల్లో డిపాజిట్లు చేయడం ద్వారా గడిచిన 2024లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల ధనం అమాంతం పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్విస్‌ నేషనల్‌ బ్యాంకు (ఎస్‌ఎన్‌బీ) తాజా గణాంకాల ప్రకారం.. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 2024లో మూడు రెట్లు పెరిగి సుమారు రూ.37,000 కోట్ల (3.5 బిలియన్‌ స్విస్‌లు)కు పైగా చేరుకుంది. ఇది 2021 తర్వాత అత్యధికం కావడం గమనార్హం. 2023లో 1.04 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు (రూ.9,800 కోట్లు)గా ఉంది. 2021లో 3.83 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు (సుమారు రూ. 30,500 కోట్లు) స్విస్‌ బ్యాంకుల వద్ద ఉంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఖర్చుల కోసం పెద్దలు ఒక్క సారిగా స్విస్‌ బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో 2023లో 70 శాతం తగ్గిపోయింది. ఎన్నికల అనంతరం తిరిగి అనూహ్యంగా పెరగడం విశేషం. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ డబ్బు వివిధ రూపాల్లో ఉంది. కస్టమర్‌ డిపాజిట్‌ల రూపంలో 346 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు (సుమారు రూ. 3,675 కోట్లు) ఉన్నాయి. ఇతర బ్యాంకుల ద్వారా స్విస్‌ బ్యాంకుల్లోకి వచ్చిన 3.02 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లుగా నమోదయ్యియి. ట్రస్ట్‌ల ద్వారా 41 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు జమ అయ్యాయి. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక సాధనాల ద్వారా 135 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు వచ్చి చేరాయి.
స్విట్జర్లాండ్‌ అధునాతన ట్రస్ట్‌ చట్టాలు సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను బినామీల ద్వారా డిపాజిట్‌ చేసుకుని రక్షించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని స్విస్‌ నల్లధనంగా భావించదు. స్విస్‌ బ్యాంక్‌ల్లో డిపాజిట్లలో భారత్‌ 2023లో 67వ స్థానంలో ఉండగా.. 2024లో 48వ స్థానానికి పెరిగింది. 2015లో ఈ ర్యాంక్‌ 75గా ఉండటం విశేషం. 2012లో 71వ ర్యాంక్‌లో ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్విస్‌ బ్యాంక్‌ల్లో భారత డిపాజిట్లు అమాంతం పెరిగాయని స్పష్టమవుతోంది. 70లో ఉన్న భారత ర్యాంక్‌ 48వ స్థానానికి ఎగబాకడం తీవ్ర ఆందోళకరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -