Monday, June 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగోదావరిలో గల్లంతైనఆరుగురి మృతదేహాలు వెలికితీత

గోదావరిలో గల్లంతైనఆరుగురి మృతదేహాలు వెలికితీత

- Advertisement -

తల్లిదండ్రులకు అప్పగింత
ఒకే చోట ముగ్గురి అంత్యక్రియలు
నవతెలంగాణ-మహదేవపూర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ గోదావరి నదిలో శనివారం సాయంత్రం గల్లంతైన ఆరుగురు యువకుల మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. శనివారం రాత్రి వరకు సింగరేణి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, స్థానిక జాలర్లు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో.. ఆదివారం ఉదయం మళ్లీ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అశోక్‌ రహమాన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాలించారు. మధ్యాహ్నం లోపు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాలను సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అప్పగించారు. మృతులు పట్టి మధుసూదన్‌, శివమనోజ్‌, తొగరి అక్షిత్‌, కర్నాల సాగర్‌ అంబటిపెల్లికి చెందిన వారు. మిగతా ఇద్దరు మహముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన పాండు అలియాస్‌ రామ్‌చరణ్‌, స్తంభంపెల్లికి చెందిన రాహుల్‌. అంబటిపల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామి కుమారులు ఇద్దరు మధుసూదన్‌, శివమనోజ్‌, అతని చెల్లి కుమారుడు రక్షిత్‌ మృతదేహాలకు ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ మాజీ సర్పంచ్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్‌రావు, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పెండ్లికి వెళ్లి..
మృతిచెందిన వారంతా విద్యార్థులు. బంధువుల పెండ్లికి హాజరయ్యారు. ఆ తర్వాత మేడిగడ్డ గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లారు. వీరందరినీ పట్టి వెంకటస్వామినే ఆటోలో తీసుకెళ్లాడు. గోదావరి నది లోతులోకి వెళ్లి స్నానం చేస్తుండగా తనకళ్ల ఎదుట ఇద్దరు కొడుకులతోపాటు చెల్లి కొడుకు, మరో ముగ్గురు గోదావరిలో మునిగి గల్లంతు కావడాన్ని చూసిన వెంకటస్వామి గుండెలు బాదుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -