Thursday, June 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌లో బోగస్‌ విద్యాసంస్థలు

ఇంజినీరింగ్‌లో బోగస్‌ విద్యాసంస్థలు

- Advertisement -

– ఏఐసీటీఈ అనుమతి ఉందా?
– ఏ విశ్వవిద్యాలయం గుర్తింపుతో ప్రవేశాలు
– వివరణ ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి నోటీస్‌
– జులై మొదటి వారంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల షెడ్యూల్‌
– ఈసారి జోసా తరహాలో మాక్‌ కౌన్సెలింగ్‌ : ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యలో బోగస్‌ విద్యాసంస్థలున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుల ఆధారంగా వాటికి ఈనెల మూడో తేదీన నోటీసులను జారీ చేశామన్నారు. ఏఐసీటీఈ అనుమతి ఉందా?, ఏ విశ్వవిద్యాలయం గుర్తింపుతో ప్రవేశాలు చేపడుతున్నారు వంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించామని అన్నారు. ఈనెల 13 వరకు వివరణ ఇచ్చేందుకు గడువు ఉందని వివరించారు. ఆ తర్వాత వివరణను బట్టి చర్యలు తీసుకుంటామనీ, ప్రభుత్వానికి, ఏఐసీటీఈకి నివేదిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన నాలుగు బోగస్‌ ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని అన్నారు. నానక్‌రాం గూడలో నెక్ట్స్‌వేవ్‌, లీప్‌స్టార్ట్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మాదాపూర్‌లో బైటెక్స్‌ఎల్‌ టెక్‌ ఎడ్‌ ప్రయివేటు లిమిటెడ్‌, హైటెక్‌సిటీలో ఇంటెల్లిపాట్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. మల్లారెడ్డి, అరోరా, చైతన్య ప్రయివేటు విశ్వవిద్యాలయాల గుర్తింపు ఉందనీ, వాటితో ఎంవోయూ కుదుర్చుకుని తరగతులను బోధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో బోగస్‌ విద్యాసంస్థలను అరికడతామని, వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వాటిలో చేరి చాలా మంది విద్యార్థులు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీటీఈ అనుమతి ఉందా?, విశ్వవిద్యాలయం గుర్తింపు ఉందా? వంటి విషయాలను తెలుసుకోవాలంటూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సూచించారు. ఆ నాలుగు సంస్థల వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని వివరించారు. వివరణ ఇవ్వకుంటే ఎలా ముందుకెళ్లాలో, వాటిని ఎలా కట్టడి చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు.
ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారుపై కసరత్తు
ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారుపై కసరత్తు జరుగుతున్నదని బాలకిష్టారెడ్డి తెలిపారు. టీఏఎఫ్‌ఆర్సీ ఇప్పటికే ఫీజు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. వాటిని ప్రభుత్వం సమీక్షిస్తున్నదని వివరించారు. కొన్ని కాలేజీలకు ఎక్కువ ఫీజు పెరగడంపై అభ్యంతరాలొచ్చాయని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జులై మొదటివారంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని అన్నారు. ఆగస్టు 14 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులను ప్రారంభించాలంటూ ఏఐసీటీఈ ఆదేశించిందన్నారు. ఈ దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి జోసా తరహాలో మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు వెబ్‌ఆప్షన్ల నమోదుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీట్ల కేటాయింపుతోపాటు ఏ బ్రాంచీలో, ఏ కాలేజీలో సీటు వస్తుంది వంటి అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ఇంజినీరింగ్‌లో కోర్‌ బ్రాంచీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఏ బ్రాంచీలో చేరాలి, ఏ కోర్సుకు భవిష్యత్తు ఉంటుంది వంటి అంశాలపై ఈనెల 16 నుంచి 21వ తేదీ మధ్యలో జేఎన్టీయూహెచ్‌లో ఒకరోజు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సుల్లో చేరితే కలిగే ప్రయోజనాలను వివరిస్తామని చెప్పారు. విద్యార్థుల కెరీర్‌ గైడెన్స్‌ కోసం త్వరలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ ఉన్నత విద్య సంస్కరణల బిల్లు తేవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని గుర్తు చేశారు. ఉన్నత విద్యామండలికి కొన్ని అధికారాలు కావాల్సి ఉందన్నారు. బోగస్‌ విద్యాసంస్థల గురించి సీఎంకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో 400 నుంచి 500 వరకు ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటి భర్తీ కోసం చర్యలు చేపడతామని అన్నారు. డిగ్రీలో 142 క్రెడిట్లు ఉండాలని నిర్ణయించామన్నారు. సిలబస్‌ మార్పు ప్రక్రియ తుది దశకు వచ్చిందని చెప్పారు.
దోస్త్‌ రెండో విడతకు 46,886 వెబ్‌ఆప్షన్లు
దోస్త్‌ రెండో విడతలో 35,954 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని బాలకిష్టారెడ్డి అన్నారు. అందులో 33,409 మంది ఫీజు చెల్లించారనీ, 34,276 మంది దరఖాస్తులను సమర్పించారని వివరించారు. రెండో విడతలో 46,886 మంది వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని చెప్పారు. ఈనెల 13న సీట్లు కేటాయిస్తామని అన్నారు. దోస్త్‌ మొదటివిడతలో 60,428 మందికి సీట్లు కేటాయిస్తే 41,285 మంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు ఇటికాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -