Saturday, May 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామాలకు పంచాయతీ కార్యదర్శులే బాస్‌లు

గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులే బాస్‌లు

- Advertisement -

– వారు లేని గ్రామ స్వరాజ్యాన్ని ఊహించలేం
– సర్వీసు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి
– వారు ఖర్చుపెట్టిన నిధులను విడుదల చేస్తాం : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జిల్లాలకు కలెక్టర్లు ఎలాగో గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులే బాస్‌లు అనీ, వారు లేని గ్రామ స్వరాజ్యాన్ని ఊహించలేమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) నొక్కి చెప్పారు. సర్పంచులు లేకపోవడంతో అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించారనీ, ఆ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని హామీనిచ్చారు. టీఏ, డీఏ చెల్లింపు అంశాలను పరిశీలిస్తామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రితో తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ బృందం సమావేశమైంది. అందులో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, డైరెక్టర్‌ సృజన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తమ శాఖ పరిధిలో ఉండే అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామనీ, మిగతా అంశాలను క్యాబినెట్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. ఉద్యోగ సమస్యలపై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ దృష్టికి పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తీసుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వం జీపీఎస్‌లను నియమించిన సమయంలో మూడేండ్ల ప్రొబిషన్‌ అని చెప్పి మరో ఏడాది పెంచిందని గుర్తుచేశారు. ఇతర ఉద్యోగులకు లేని షరతులు పెట్టి నియామకాలు చేపట్టడంతో ఇప్పుడు అనేక చిక్కులు ఎదురవుతున్నాయనీ, కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జాయిన్‌ అయిన మొదటి రోజు నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటే ఎన్నో న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తున్నాయన్నారు. అయినప్పటికీ జీపీఎస్‌లకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. గ్రామాల సమగ్రాభివృద్ధి పంచాయతీ కార్యదర్శుల సమర్థత మీదే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నెలల తరబడి విధులకు హాజరు కావడం లేదనీ, వారిపట్ల మానవతా దృక్పథంతో సర్వీసు నుంచి తొలగించడం లేదని చెప్పారు. 1038 మంది ఔట్‌ సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులను జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా చేయాలన్న ప్రతిపాదనను, స్పోర్ట్స్‌ కోటాలో రిక్రూట్‌ అయి తొలగించబడిన 98 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను తిరిగి చేర్చుకునే అంశంపై కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం పూర్తయితే జీపీఎస్‌లపై కొంత భారం తగ్గుతుందని చెప్పారు. స్పోర్ట్స్‌ కేటగిరీలో మ్యూచువల్‌ బదిలీలు చేయాలన్న ప్రతిపాదనపై మరింత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రికి టీజీజీపీఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవాధ్యక్షులు సందీప్‌, కోశాధికారి శేఖర్‌ గౌడ్‌, తదితరులు కృతజ్ఞతలు చెప్పారు. మంత్రికి పూలమొక్కను ఇచ్చి సన్మానించారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -