– NCD సమీక్షలో Dy DM & HO డా. దేవేందర్ ఆదేశాలు
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం (05-02-2026) నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (NCD) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాటారం, అంబటిపల్లి పీహెచ్సీలకు చెందిన ఎంఎల్హెచ్పీ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఎన్సీడీ నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి Dy DM & HO డా. దేవేందర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ క్షేత్రస్థాయిలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. గుర్తించిన రోగులకు డాక్టర్లు తక్షణమే చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు.
నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన సిబ్బంది రాబోయే రెండు నెలల్లో తప్పనిసరిగా లక్ష్యాలను సాధించాలి, లేనిచో కమిషనర్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాటారం పీహెచ్సీ వైద్యాధికారి డా. మౌనిక, అంబటిపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డా. కళ్యాణి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ లింగారెడ్డి, మురళీధర్, ఎన్సీడీ కన్సల్టెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.



