Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగన్‌ కల్చర్‌ తెచ్చిందే బీఆర్‌ఎస్‌

గన్‌ కల్చర్‌ తెచ్చిందే బీఆర్‌ఎస్‌

- Advertisement -

అబద్ధాలతో దిగజారుతున్న హరీశ్‌రావు : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో గన్‌ కల్చర్‌ను తెచ్చిందే బీఆర్‌ఎస్‌ పార్టీ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ(సీతక్క) విమర్శిం చారు. తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా క్యాబినెట్‌ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతమూ జరగలేదని స్పష్టం చేశారు. అందులో ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తన తప్పుడు మాటలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో హరీశ్‌రావు ఉన్నారని విమర్శించారు. క్యాబినెట్‌ సమావేశంలో గొడవ జరిగిందని నిరూపిస్తావా? అని సవాల్‌ విసిరారు. ”ఇబ్రహీంపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ గొడవల్లో తుపాకులతో కాల్పులు జరిపితే ఇద్దరు చనిపోయారు.

హరీశ్‌రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ ఆవరణలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు ఎత్తుకెళ్లారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగానే అడ్వకేట్‌ వామనరావు దంపతులను నరికి చంపారు. అవినీతికి, అబద్ధాలకు, అహంకారానికి నిలువెత్తు నిదర్శనం బీఆర్‌ఎస్‌” అని విమర్శించారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛే లేదనీ, అంతా పంజరంలోని చిలుకల్లా ఉన్నారని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వంలో మంత్రులందరికీ స్వేచ్ఛ ఉందనీ, ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్‌ సమావేశం జరుగుతున్నదని చెప్పారు. హరీశ్‌రావు ఇప్పుడు ఓ పత్రిక అబద్ధపు కథనాలను అమ్మే సేల్స్‌మెన్‌గా మారిపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తున్నదనీ, అందుకే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావడం లేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతికి సజీవ సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అనీ, కేసీఆర్‌ కూతురు కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -