– కాంగ్రెస్ మోసాలను ప్రజలు తిప్పికొడతారు: కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కాలేదనీ, పేదల ఆశలు అడియాశలయ్యాయని మండిపడ్డారు. మహిళలకు రూ.2,500 పెన్షన్, వృద్ధాప్య పించన్ రూ.4,000 పెంపు, కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం.. ఇలా 420 వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు.
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. హైదరాబాద్ను దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు వెల్లడించారు. ”20 వేల లీటర్ల ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5కే భోజనం, పింఛన్లతో పాటు అనేక పథకాలు అమలు చేశాం. ప్రాపర్టీ ట్యాక్స్ను తీసేశాం. షేక్పేటలో పెద్ద ఫ్లైఓవర్ను నిర్మించాం. జీహెచ్ఎంసీతో పాటు ప్రతి ఎన్నికలో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు ఓటేశారు” అని ఆయన వివరించారు. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులతో పాటు సబ్బండ వర్ణాలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. షేక్పేట్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షులు తోట మహేష్తో పాటు పలువురు నాయ కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



