– 14న కరీంనగర్లో సభ.. హాజరుకానున్న కేటీఆర్
– కాంగ్రెస్ బూటకపు హామీలు: తలసాని శ్రీనివాస్
– బీసీలకు అవకాశాలిచ్చింది కేసీఆరే: గంగుల కమలాకర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈనెల 14న కరీంనగర్లో ‘బీసీ కదన భేరి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు సంబంధించిన సన్నాహక సమావేశం సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని, ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కేవలం ఓ తీర్మానం చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. కుల గణన, 42 శాతం రిజర్వేషన్ల అంశాలపై లోక్సభ ఎన్నికలకు ముందు హడావిడి చేసి ఇప్పుడు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి బీసీల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు గురుకులాలు ఏర్పాటు చేసి, కులవృత్తులకు వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నించారా అని ప్రశ్నించారు. వంద మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ‘బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించింది, ఆర్టీసీ చైర్మెన్గా, హైదరాబాద్ మేయర్గా బీసీలకు అవకాశం ఇచ్చింది కేసీఆర్’ అని తెలిపారు. మంత్రులుగా కూడా బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది గత ప్రభుత్వమే అని చెప్పారు. తదనంతరం శాసన మండలి పక్ష నేత మధుసూదనచారి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సహా పలువురు నేతలు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, ఎల్.రమణ, మాజీ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ వకులాభరణం కృష్ణమోహన్, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఒడితెల సతీష్బాబు, విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ ‘కదన భేరి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES