Thursday, June 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెట్టుబడులపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం

పెట్టుబడులపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం

- Advertisement -

ఎంఎస్‌ఎంఈల బకాయిలు విడతల వారీగా చెల్లిస్తాం
నిబంధనలు పాటించని ఇథనాల్‌ కంపెనీలపై చర్యలు
రూ.2,125 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న పెట్టుబడులపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిన్న ర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామనీ, ఫలితంగా ప్రయివేట్‌ రంగంలో లక్ష మందికిపైగా యువతకు ఉద్యోగాలు లభించాయని అన్నారు. ”రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి మేం తీసుకొస్తున్న పెట్టుబుడులు, కల్పిస్తున్న ఉద్యోగాలు కనిపించడం లేదా..? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’ అని మంత్రి అన్నారు. ఎంఎస్‌ఎంఈల సబ్సిడీలను గత సర్కార్‌ పదేండ్లుగా చెల్లించకపోవడంతో రూ.4 వేల కోట్లకు చేరుకున్నాయనీ, వాటిని విడతల వారీగా విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటును బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోందని విమర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీరో పొల్యూషన్‌గా వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. ”ఇక్కడి యువత ప్రతిభే మాకున్న పెద్ద ఆస్తి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టా తీసుకుని బయటికొచ్చే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదనే ఫిర్యాదు పారిశ్రామికవేత్తల నుంచి తరచూ వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశాం. అందరి భాగస్వామ్యంతో కోర్సులకు రూపకల్పన చేసి మానవ వనరులను రెడీమేడ్‌గా పరిశ్రమలకు అందిస్తున్నాం. తెలంగాణ ప్రతిభకు కేరాఫ్‌ అడ్రస్‌. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు కేంద్రం. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి. పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాం” అని పారిశ్రామిక వేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు.
రూ.2125 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
యూఏఈకు చెందిన శైవ గ్రూప్‌, టారనిస్‌ కేపిటల్‌ సంయుక్తంగా రూ.2125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్రానికి చెందిన ఐదు స్థానిక కంపెనీలతో.. ఈ రెండు సంస్థలు మంగళవారం మంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. తద్వారా కొత్తగా మరో 5,020 మంది స్థానిక యువతకు ఉపాధి లభించనుందని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామయ్యేందుకు ముందుకొచ్చిన శైవ గ్రూప్‌, టారనిస్‌ కేపిటల్‌ కంపెనీలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రారు డిన్‌ రోచ్‌, శైవ గ్రూప్‌ చైర్మెన్‌ అమిత్‌ జగన్నాథ్‌ వర్మ, టారనిస్‌ కేపిటల్‌ సీఈవో నికోలస్‌ ఎస్‌.బింగ్‌ హామ్‌, రివలేషన్స్‌ బయోటెక్‌ ఎండీ రవిచంద్ర బీరం, మనాకిన్‌ బయో డైరెక్టర్‌ జశ్వంత్‌ ప్రణవ్‌ యతిరాజాం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అడ్వైజర్స్‌ సీఈవో సంకర్ష్‌ చందా, ఎగ్జిగెంట్‌ డ్రిల్లింగ్‌ టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పాండురంగా రావు తమ్మినేని, యంత్ర టెక్‌ కంట్రోల్స్‌ సీఈవో సమీర్‌ కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
కంపెనీ పేరు పెట్టుబడి (కోట్లల్లో) ఉపాధి
1).రివలేషన్స్‌ బయోటెక్‌ రూ.1,360 3,080
2). మనాకిన్‌ బయో రూ.340 810
3). స్వబోధ ఇన్ఫినిటీ రూ.80 220
4).ఎగ్జిగెంట్‌ డ్రిల్లింగ్‌ టెక్నాలజీ రూ.90 270
5).యంత్ర టెక్‌ కంట్రోల్స్‌ రూ.255 640

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -