నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సామినేని రామారావును గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సామినేని రామారావు రోజూ మాదిరిగానే ఈరోజు ఉదయం వాకింగ్కు వెళ్లారు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఆయన్ను అడ్డగించిన దుండగులు, పదునైన ఆయుధంతో గొంతుకోసి హతమార్చారు. రక్తపు మడుగులో పడివున్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 
                                    