న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యంలో 93 శాతం సాధించి.. రూ.5,347 కోట్లకు చేరుకుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య శిండే తెలిపారు. సేవల నాణ్యతను వారాలు, నెలల బదులు రోజువారీగా పర్యవేక్షించేందుకు మరింత కఠినమైన ప్రమాణాలు అనుసరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గంటలు, రోజుల గడువులు విధించాలన్నారు. బిఎస్ఎన్ఎల్ త్రైమాసిక సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో బిఎస్ఎన్ఎల్ ఆదాయం రూ.11,134 కోట్లకు చేరిందన్నారు. ఆదాయ లక్ష్యాలకు దగ్గరగా ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని 20 శాతం పెంచి రూ.27,500 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఖర్చులపై నియంత్రణ ఉంచాలని నిర్దేశించుకున్నామన్నారు.



