మున్సిపల్ ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిర్ణయం
రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వస్తాయి. దీంతో ఈనెల 16 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఏ రోజు సమావేశానికి రావాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోని విషయాల గురించి చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది.
ఆరు గ్యారంటీలు, పలు డిక్లరేషన్లు, ఇతర హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొత్త పథకాలు ఏమైనా ప్రకటిస్తుందా?అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలనే దానిపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. జనవరి 23 నుంచి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో శాఖల వారీగా ఆన్లైన్లో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాయి. గతనెల 24 నుంచి శాఖల వారీగా ఆర్థిక శాఖ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమలు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెలాఖరు లేదంటే వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశమున్నది.
16 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



