విద్య వెలకట్టలేని సంపద. పురోగతిని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం విద్య నేడు. ఆ విద్యే తల్లిదండ్రులకు పెనుభారంగా మారింది. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభ సమయం దగ్గరపడినప్పుడల్లా ఫీజుల అంశం తల్లిదండ్రులకు నిద్ర పట్టనీయడం లేదు. ప్రయివేటు విద్యాసంస్థల్లో అక్షరాలు దిద్దించడానికే ఫీజు లక్ష రూపాయలుంది. ఉన్నత విద్యారంగంలో ఫీజుల గురించి మాట్లాడానికి వీల్లేకుండా ఉంది. డొనేషన్లకు హద్దే లేదు. దీనికంతంటికీ ప్రయివేటు మోజులో తల్లిదండ్రులు పడిపోవడమే కారణమని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వాల విధానాలే ప్రభుత్వ విద్య మరుగున పడి ప్రయివేటు విద్య పెరగడానికి కారణమని విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో భారీగా పెరుగుతున్న ఫీజులే చర్చనీయాంశంగా మారాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్వత్రా ఇదే పరిస్థితి. ముఖ్యంగా గత మూడేండ్లలో స్కూల్ ఫీజులు అనేక రెట్లు పెరిగాయి. పాఠశాల ఫీజులు 50 నుంచి 80 శాతం పెరిగాయని ఇటీవల దేశవ్యాప్తంగా ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను ఒక వాణిజ్య వస్తువుగా మార్చి, తల్లిదండ్రుల జేబులను దోచుకుంటున్నాయి. ఏటా 10-30 శాతం ఫీజుల పెంపు మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. నాణ్యమైన విద్య పేరుతో ఈ దోపిడీ సమర్థించబడుతున్నప్పటికీ, లాభాపేక్ష తప్ప పారదర్శకత లేని విధానాలు తల్లిదండ్రులలో మానసిక ఒత్తిడిని రేకెత్తిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఉచితంగా అందిస్తానని గత పాలకులు మాటిచ్చారు. కార్పొరేట్ అన్న మాట తెలంగాణలో వినపడకుండా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఉచిత విద్య ఊసే మరిచారు. ఉచితవిద్య అటకెక్కించడమే కాదు, ప్రయివేటు విద్యా సంస్థలకు మరింతగా తలుపులు బార్లా తెరిచింది. ప్రయివేటు యూనివర్సిటీలకు స్వాగతం చెప్పింది. దీనివల్ల చిన్న చిన్న ప్రయివేటు స్కూల్స్ పక్కకు పోయి పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో సాగుతోంది. దీంతో ప్రయివేటు , కార్పొరేట్ విద్యాసంస్థలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కొత్త పేర్లు తగిలించి ఏకాయెకిన ఫీజులను 30 శాతం పెంచేశాయి. ఫీజులను నియంత్రణ చేస్తామని పాలకులు చెబుతున్నా వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు లేవు. దీంతో ఫీజుల కట్టడి అన్నది ప్రతి విద్యాసంవత్సరం కేవలం నినాదంగానే మిగిలిపోతోంది. ఫీజులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతిగా ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నాయి.
ఉదాహరణకు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఉద్యోగి కథ ఈ సమస్య తీవ్రతను స్పష్టం చేస్తుంది. నెలకు రూ.35 వేలజీతం సంపాదించే ఆ ఉద్యోగి, తన రెండో కుమారుడిని (5వ తరగతి) ఒక స్కూల్లో చేర్పించేందుకు వెళ్లగా, యాజమాన్యం రూ.లక్షా యాభై వేల ఫీజు కోట్ చేసింది. ఇందులో ట్యూషన్ ఫీజుతో పాటు అదనపు కార్యక్రమాలు, యాప్లు, పుస్తకాల పేరుతో అనేక ఖర్చులు ఉన్నాయి. ఏడాదికి కోసారి ఫీజు మార్పుదల ఉంటుంది. మరో ఉద్యోగి తన రెండో కుమారుడి కోసం ఒక ప్రొపెషనల్ కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్లగా ఏడాదికి రూ.మూడున్నర లక్షల ఫీజు అని యాజమాన్యం చెప్పేసింది. మిగతావాటితో కలుపుకుని రూ. ఐదు లక్షలు. డొనేషన్లు అదనం. ఈ దోపిడీ ఒకటి రెండు కుటుంబాలది మాత్రమే కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్య కోసం తపన పడుతున్న తల్లిదండ్రులందరిది. వారి ఆ తాపత్రయమే ప్రయివేటు విద్యాసంస్థలకు పెట్టుబడిగా మారింది. ఫీజుల భారం మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలో పడేస్తోంది. జీవన నాణ్యతను క్షీణింపజేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, అమలు కేవలం కాగితంపైనే మిగిలిపోతోంది. గతంలో ాసర్కార్ కమిటీ వేసి కాలయాపన చేసింది. ప్రస్తుతమున్న సర్కార్ కూడా కమిటీ వేయగా, అది సూచనలు, సలహాలతో నివేదిక ఇచ్చినా ఇంకా ఫీజులు మాత్రం ఖరారు చేయలేదు. రైట్ టు ఎడ్యూకేషన్ చట్టం ప్రకారం, ప్రయివేటు స్కూళ్లు ఇరవైఐదు శాతం సీట్లను ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థులకు కేటాయించాలి. ఫీజు రీయింబర్స్మెంట్లో ఆలస్యం, నిధుల కొరత వల్ల ఈ నిబంధన నీరసించింది. ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వ విధానాలు సీరియస్గా అమలు జరగాలి. ప్రభుత్వం బలమైన ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి. స్కూళ్లు తమ ఆర్థిక నివేదికలను పారదర్శకంగా సమర్పించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. సమాజం కూడా కలిసి నడవాలి. తల్లిదండ్రులు సంఘాలుగా ఏకమై, స్కూల్ యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఫీజు పెంపుపై ఒత్తిడి తెచ్చే చర్యలు చేపట్టాలి. లేకపోతే, ఈ ”చదువుల మార్కెట్” ప్రజలను మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుంది. దోపిడీ నుండి విముక్తి చేసి, సమాన అవకాశాల సమాజాన్ని నిర్మించడం మన ముందున్న అత్యవసర లక్ష్యం.
ఫీజుల భారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES