రంగంలోకి దిగిన మెరైన్ బలగాలు
తీవ్రంగా నిరసించిన కాలిఫోర్నియా గవర్నర్
చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలు
లాస్ ఏంజిలీస్ : అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలపై లాస్ ఏంజిలీస్లో వరుసగా నాలుగవ రోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. కాగా, పరిస్థితులను అదుపులోకి తెచ్చే పేరుతో ఇప్పటికే రంగంలోకి దిగిన దాదాపు నాలుగువేల మంది నేషనల్ గార్డ్ బలగాలకు తోడుగా మెరైన్ బలగాలను కూడా మోహరించాల్సిందిగా ట్రంప్ తాజాగా ఆదేశించారు. దాంతో దాదాపు 700మంది మెరైన్లు లాస్ ఏంజిలీస్ వీధుల్లో విధుల్లోకి దిగారు. ఈ చర్యపై కాలిఫోర్నియా గవర్నర్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ మోహరింపు అధికార దుర్వినియోగమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ గవిన్న్యూసమ్ హెచ్చరించారు. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. కాగా, లాస్ ఏంజిలీస్లో సోమవారం రాత్రంతా దాదాపు ప్రశాంతంగానే సాగింది. చాలావరకు శాంతియుతమైన నిరసనలే చోటు చేసుకున్నాయి. అయినా మంగళవారం ఉదయానికల్లా కొత్త బలగాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ నెలకొన్న అశాంతి, ఉద్రిక్త పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనే శక్తి రాష్ట్ర బలగాలకు వుందని కాలిఫోర్నియా డెమోక్రాట్ నేతలు చెబుతున్నారు. ఈ బలగాలు దాదాపు 60రోజుల పాటు లాస్ ఏంజిలీస్ లో వుంటాయని భావిస్తున్నారు.
రగులుతున్న లాస్ఏంజీలిస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES