Thursday, May 29, 2025
Homeరాష్ట్రీయంతరుగు లేకుండా ధాన్యం కొనాలి

తరుగు లేకుండా ధాన్యం కొనాలి

- Advertisement -

– మెదక్‌ జిల్లా నార్సింగిలోని భాగ్యలక్ష్మి రైస్‌ మిల్లు ఎదుట రైతుల ఆందోళన
– అధికారుల జోక్యంతో ఒప్పుకున్న మిల్లు యాజమాన్యం
నవతెలంగాణ-నార్సింగి

మెదక్‌ జిల్లా హవేలీ ఘనపూర్‌ మండలం రాజీపేట గ్రామానికి చెందిన రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు పంపగా.. తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామంటూ మిల్లు యజమాని స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని ఐదు రోజుల క్రితం నార్సింగిలోని భాగ్యలక్ష్మి రైస్‌ మిల్లుకు తరలించారు. ధాన్యం తడిసిందని తరుగు ఇస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటానని రైస్‌ మిల్‌ యజమాని శ్రీనివాస్‌ కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో చెప్పడంతో వారు రైతులకు సమాచారం అందించారు. దాంతో రైతులు రైస్‌ మిల్‌కు చేరుకొని.. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తరుగు లేకుండా తీసుకోవాలని రైస్‌ మిల్‌ యజమాని శ్రీనివాస్‌ను కోరారు. ధాన్యం తడిసి మొలకెత్తిందని, తరుగు తీయాల్సిందేనని మిల్లు యజమాని స్పష్టం చేశారు. అందుకు ఒప్పుకోని రైతులు.. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రైస్‌ మిల్‌ గేటు ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌ దృష్టికి అధికారులు తీసుకుకెళ్లారు. స్పందించిన అదనపు కలెక్టర్‌ రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైస్‌ మిల్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్‌ సప్లరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సివిల్‌ సప్లరు అధికారులు స్థానిక తహసీల్దార్‌ షేక్‌ కరీంకు విషయాన్ని తెలుపగా.. ఆయన భాగ్యలక్ష్మి రైస్‌ మిల్లుకు చేరుకొని యాజమానితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేయాలని, తరుగు లేకుండా ధాన్యాన్ని సేకరించాలని యజమానిని ఆదేశించారు. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆందోళన విరమించారు. తరుగు లేకుండా ధాన్యం సేకరణకు రైస్‌ మిల్లు యాజమాన్యాన్ని ఒప్పించినందుకు జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌, సివిల్‌ సప్లరు అధికారి సురేష్‌, తహసీల్దార్‌ షేక్‌ కరీం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌కు బాధిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -