– ముగ్గురు మంత్రులు ప్రమాణం
– హాజరైన సీఎం, ఇతర మంత్రులు
– 15కు చేరిన మంత్రుల సంఖ్య
– భవిష్యత్లో మరో ముగ్గురికి అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఆదివారం హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో ఎమ్మెల్యేలు జీ వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ వారితో ప్రమాణం చేయించారు. సీఎం ఏ రేవంత్రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ జీ ప్రసాద్కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్ పర్సన్లు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డితో పాటు ఆహ్వానితులందరూ అభినందనలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు పలువురు వారికి అభినందనలు చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందనీ, మంత్రివర్గ విస్తరణలో కూర్పుతో మరోసారి అది నిరూపితమైందని వారన్నారు. ఇప్పటికే కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ద్వారా సామాజిక న్యాయాన్ని చాటిందన్నారు. కులగణనతో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందో తెలంగాణను రోల్ మోడల్గా చూస్తున్నారని తెలిపారు.
15కు చేరిన మంత్రుల సంఖ్య
నూతనంగా ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య15కు చేరింది. అంతకుముందు సీఎంతో సహా 12 మంది మంత్రులు ఉన్నారు. ఆరు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. విస్తరణలో వాటిని పూర్తిగా భర్తీ చేస్తారని భావించారు. కానీ ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉంది. మరో మూడు మంత్రి పదవుల్ని భర్తీ చేసుకొనే అవకాశం సీఎం రేవంత్రెడ్డికి ఉంది. త్వరలో వాటిని కూడా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
సామాజిక సమీకరణాలు ఇలా…
నూతన మంత్రివర్గ విస్తరణ తర్వాత సీఎం రేవంత్రెడ్డి టీంలో సామాజిక సమీకరణాలు ఇలా ఉన్నాయి. రెడ్లు -4, బ్రాహ్మణ-1, వెలమ-1, కమ్మ- 1 (మొత్తం ఓసీలు-7), బీసీలు-3, ఎస్సీలు-4 (ఇద్ద రు మాల, ఇద్దరు మాదిగ), ఎస్టీ-1 మంత్రులుగా ఉన్నారు.
కొత్త మంత్రుల నేపథ్యమిదే..
గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రముఖ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి వారసునిగా రాజకీయా ల్లోకి ప్రవేశించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో మళ్లీ టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ టికెట్ దక్కక పోవడంతో 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. 2023లో మళ్లీ కాంగ్రెస్లో చేరిన వివేక్ చెన్నూ రు ఎమ్మెల్యేగా గెలిచి, రేవంత్రెడ్డి సర్కారులో మంత్రిగా ప్రమాణం చేశారు.
అడ్లూరి లక్ష్మణ్…
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే అడ్లూరి లక్ష్మణ్ను మంత్రి పదవి వరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 2,229 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1968లో కరీంనగర్ జిల్లాలో జన్మించారు. పెద్దపల్లి కళాశాలలో ఐటీఐ పూర్తి చేశారు. 1986-1994 మధ్య కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1996-2001 మధ్య ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో ధర్మారం జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2009లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010-2012 మధ్య కరీంనగర్ జడ్పీ చైర్మెన్గా పని చేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2013-14 మధ్య ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్గా పని చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
వాకిటి శ్రీహరి…
ఎమ్మెల్యే అయిన తొలిసారే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. ఆయన 1972లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,522 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014-2018 మధ్య మక్తల్ జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్లీడర్గా పనిచేశారు. 20012006 మధ్య మక్తల్ సర్పంచిగా ఉన్నారు. నారాయణ పేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శిగా పని చేశారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం
సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మరోసారి స్పష్టమైందని నూతన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ దశల్లో పని చేసిన తనకు న్యాయం జరిగిందన్నారు. తనను గుర్తించిన సీఎం రేవంత్రెడ్డికి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో పాటు సహచర మంత్రులకు, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేసిన కాంగ్రెస్ అదే రీతిలో అన్ని విధాలుగా మాదిగలకు అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్
క్యాబినెట్ విస్తరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES