Thursday, June 12, 2025
E-PAPER
Homeజాతీయంక్యాబినెట్‌ కూర్పుపై కసరత్తు

క్యాబినెట్‌ కూర్పుపై కసరత్తు

- Advertisement -

అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మంతనాలు
పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు, చేర్పులు?
కొత్త మంత్రుల శాఖల కేటాయింపు ఆలస్యం
నేడు స్పష్టత వచ్చే అవకాశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై హస్తినలో రెండో రోజూ కసరత్తు కొనసాగినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించారు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన ముగ్గురికి మంత్రిత్వ శాఖ కేటాయింపుతో పాటు, పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పు లు చేర్పులు చేయాలని నిర్ణయించినట్టు ప్రాథమిక సమాచారం. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై కీలక సమావేశం జరిగింది. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో సామాజిక న్యాయం ఆధారంగా మంత్రిత్వ శాఖలను కేటాయించాలని అగ్రనేత రాహుల్‌ సూచించినట్టు తెలిసింది. ఈ దిశలో ప్రస్తుతం సీఎం, మంత్రుల వద్ద ఉన్న శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం మంత్రిత్వ శాఖల జాబితాను అగ్రనేతలకు అందజేయడంతో పాటు, ఏడాదిన్నరగా ఆ శాఖల పనితీరును వివరించినట్టు తెలిసింది. అలాగే కొత్తగా మంత్రివర్గం లోకి వచ్చిన వారికి ఏయే శాఖలు కేటాయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా పలువురు మంత్రులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న శాఖలతో సంతృప్తిగా లేరనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నా పలు శాఖల వారీగా వైఫల్యంపై ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే కొందరు మంత్రులు తమ శాఖలు మార్చాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ పర్యటనల్లో పలుమార్లు ఈ విషయాన్ని ఆయా మంత్రులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోని ఆయా శాఖల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులపై చర్చించారు. శాఖల కేటాయిం పులో సీఎం నిర్ణయమే కీలకమైనందున, ఆయన అభిప్రాయానికి అధిష్టానం సైతం పెద్ద పీట వేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సీఎం దగ్గర ఉన్న ఇతర శాఖలు, పలువురు మంత్రుల దగ్గర ఒకటికి మించి ఉన్న శాఖలపై అధిష్టానం చర్చించింది. ఇందులో కీలకమైన శాఖలను సామాజిక న్యాయం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నిర్ణయంతో తమ సర్కార్‌… బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ… సామాజిక న్యాయం అమలులో ముందు వరుసలో ఉందనే సిగల్‌ ఇవ్వాలని చూస్తోంది. అందుకే కొత్త మంత్రుల శాఖల కేటాయింపు ఆలస్యం అవుతున్నట్టు ముఖ్య నేతల ద్వారా తెలిసింది. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, శాఖల మార్పులపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -